హైదరాబాద్, జూలై 3,
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మొన్నటి వరకు అలయ్ బలయ్ అంటూ ఉన్న ఎంఐఎం - బీఆర్ఎస్ మధ్య కూడా డైలాగ్ వార్ షురూ అయింది. అంతేకాదండోయ్... గులాబీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.... నేరుగా ఎంఐఎం చీఫ్ కే సవాల్ విసిరారు. ఇది కాస్త టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఎన్నికల సమరానికి టైం దగ్గరపడుతోంది. ఇక నెలల సమయం మాత్రం ఉంది..! ఇంకేముంది ప్రధాన పార్టీలన్నీ కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యే పనిలో పడ్డాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని BRS భావిస్తుండగా... ఈసారి ఎలాగైనా తెలంగాణను కొట్టాలని కాంగ్రెస్ గట్టిగా చూస్తోంది. ఇక కమలనాథులు మాత్రం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే... పాతబస్తీకే పరిమితమై వస్తున్న ఎంఐఎం... సరికొత్త స్ట్రాటజీతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాలోని ఓ సీటుపై ఎలాగైనా పతంగిని ఎగరవేయాలి చూస్తోంది. ఇది కాస్త బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం అని పరిస్థితికి దారి తీసేలా ఉంది. ఫలితంగా తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది.బీఆర్ఎస్ తో దోస్తీగానే ఉంటూ వస్తున్న MIM పార్టీ.... నెమ్మదిగా టార్గెట్ చేసే పనిలో పడింది. తెలంగాణలో తాము కూడా ప్రత్యామ్నాయమే అంటూ ఇటీవలే అసదుద్దీన్ మాట్లాడారు. అంతేకాదు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే... నిజామాబాద్ జిల్లాలోని బోధన్ సీటుపై కూడా కన్నేసింది. ఎలాగైనా అక్కడ పతంగిని ఎగరవేయాలిని చూస్తోంది. ఇప్పటికే బోధన్ వేదికగా.... బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్లు ఉంది. ఇటీవల బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కు.. ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు మజ్లిస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో పరామర్శకు అసదుద్దీన్ నిజామాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో వాలని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. బోధన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పై హత్యాయత్నం చేశారంటూ…. ఎంఐఎంనేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం హేయమైన చర్య అని కామెంట్స్ చేశారు. బోధన్ నియోజకవర్గంలో జరుగుతున్నదంతా ప్రజలు గమనిస్తున్నారని.... వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. ఇక అసదుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన షకీల్… కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే... అసదుద్దీన్ ఓవైసీ తనపై బోధన్ లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఫలితంగా బోధన్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారినట్లు అయింది. ఎంఐఎం కూడా... బోధన్ విషయంలో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఇక్కడ... ఎలాగైనా పతంగిని ఎగరవేయాలని చూస్తోంది...!నిజానికి పాతబస్తీకే పరిమితనుకున్న ఎంఐఎం... గత కొన్ని ఏళ్లుగా రూట్ మారుస్తూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్లపై కన్నేసిన ఆ పార్టీ... కేడర్ తో పాటు నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిలో పడింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకోబోతుంది. దారుసలేం వేదికగా మజ్లిస్ విస్తరణకు చాలా రోజులుగా ప్రణాళికలు జరుగుతూనే ఉన్నాయి. పట్టున్న ప్రాంతాలేవీ? ఏయే స్థానాల్లో పోటీ చేయవచ్చు... అక్కడ సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయన్న అంశాలపై గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి మజ్లిస్ ఎక్కడ పోటీ చేసినా ముస్లీం సామాజికవర్గ ఓట్లు ప్రధానంగా చూసుకుంటుంది. అయితే ఆ వర్గానికి చెందిన నేతలకే టికెట్లు ఇవ్వకుండా... ఇతర మతాలకు చెందిన లీడర్లకు టికెట్లు ఇవ్వాలని చూస్తోంది. ఫలితంగా కొన్నిచోట్ల గెలిచే అవకాశాలపై లెక్కలు వేసుకుంటోంది.గతంలో నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఎంఐఎం 23.5శాతం ఓట్లు తెచ్చుకుంది. అక్కడ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థికి 31శాతం ఓట్లే వచ్చాయి. ఇదే కాదు 2014 ఎన్నికల్లో బంజారాహిల్స్ లో రెండోస్థానంలో నిలిచింది ఎంఐఎం. 2018 ఎన్నికల్లో రాజేందర్ నగర్ సీటును కొట్టాలని గట్టిగా పని చేసింది. అంబర్ పేట వంటి స్థానాల్లోనూ ఎంఐఎం బలంగానే ఉంది. వీటికి తోడు వచ్చే ఎన్నికల్లో కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, నిర్మల్, ముథోల్, బైంసా, అదిలాబాద్, బోధన్, కామారెడ్డి, మహబూబ్ నగర్, జహీరాబాద్, షాద్ నగర్, వికారాబాద్, సిర్పూర్, కోరుట్ల, భువనగిరి, వరంగల్ తూర్పు నియోజకవర్గాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయా స్థానాల్లో గట్టిగా ట్రై చేస్తే... పాతబస్తీనే కాదు బయట కూడా సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని.. ఫలితంగా సీట్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను కూడా ఆకర్షించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.