YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వ్యక్తిగత విమర్శలతో పరువు గంగ పాలు

వ్యక్తిగత విమర్శలతో పరువు గంగ పాలు

విజయవాడ, జూలై 5, 
ఒకప్పుడు రాజకీయాలు వేరు.. ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలలో ప్రజా పాలన, ప్రజా రక్షణ పక్కన పెట్టి ఒకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి.. దాన్నే విమర్శలగా మలచి దాడులు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇలా నేతలు తిట్టి పోసుకుంటుంటే కార్యకర్తలు దీనికి తలా ఒక చేయి వేసి ఆజ్యం పోస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. ఒక రకంగా ఇదో రకం డైవర్షన్ పాలిటిక్ లాగా తయారైంది. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో వైసీపీ నేతలు డాక్టరేట్స్ పొందారు. సాక్షాత్తు సీఎం జగన్ నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా చాలామంది నేతలు ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిపోయారు. అలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకు వైసీపీ నేతలు ఎంచుకున్న బాష దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్. అలాగే  ఆయన పెళ్లిళ్లను   హైలెట్ చేయడం.అలా సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ మాదిరిగా మనం నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేం అంటూ విమర్శలు చేశారు. ఇటీవల పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో కూడా జగన్ మరోసారి సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం ఓ దత్తపుత్రుడు లారీ ఎక్కి ఊగిపోతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయనలా మ‌నం రౌడీల్లా తొడ‌లు కొట్ట‌లేం.. బూతులూ తిట్టలేం.. వారిలా న‌లుగురిని పెళ్లి చేసుకుని, నాలుగేళ్ల‌కోసారి భార్య‌నూ మార్చ‌లేం.. పెళ్లి అనే పవిత్ర వ్య‌వ‌స్థ‌ను రోడ్డు మీదికి తీసుకురాలేం.. అవ‌న్నీ ప‌వ‌న్‌కు మాత్రమే సాధ్యం అంటూ సెటైర్లు వేశారు.భవిష్యత్ ఉన్న భావితరం, స్కూల్ పిల్లలున్న సభలో ఇలా పెళ్లిళ్ల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి విమర్శలు చేయడం కరెక్టేనా అని కొంచెం కూడా ఆలోచన లేకుండా సీఎం జగన్.. పవన్ మీద   నోరు పారేసుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసుకున్నది మూడు పెళ్లిళ్లే. అది ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా ఆయనే పలుమార్లు కామెడీగా చెప్పారు.. సీరియస్ గా హెచ్చరిస్తూ కూడా చెప్పారు. అయినా ఇంకేం లేవన్నట్లు సీఎం స్థాయి వ్యక్తి కూడా దిగజారి ఇలా అదే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఇప్పుడు జన సైనికులు సీఎం జగన్ టార్గెట్ గా వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. జగన్ తాతల కాలం నుండి వారి కుటుంబంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారిని ఉదాహరణగా చూపిస్తూ పోస్టులు కుమ్మరిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తాత వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలన్న సంగతి అందరికీ తెలిసిందే. రెండో భార్య సంతతే వైఎస్ రాజారెడ్డి.. వెంకటరెడ్డి మొదటి భార్యకు మనవడే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి. దీన్నే కోడ్ చేస్తూ సీఎం జగన్ ను విమర్శలతో ఏకి పారేస్తున్నారు. ఇక జగన్ సోదరి షర్మిళ విషయాన్ని కూడా సీన్ లోకి తెస్తూ కొందరు   విమర్శలకు దిగుతున్నారు. ఇక, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా రెండో పెళ్లి సంగతి కూడా ఆయన మరణానంతరం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వివేకా రెండో పెళ్లితో పాటు ఆయన హత్యను కూడా కలిపి సోషల్ మీడియా వాల్స్ బద్దలయ్యేలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక, జనసేన నాయకుల్లో ఒకరైన డాక్టర్ సందీప్ అయితే ఒక టీవీ ఛానెల్ చర్చలో 'జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు. మరి ప్రత్యేక హోదా ఏదీ?.. జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు.. మరి సీపీఎస్ రద్దు చేశాడా? జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు.. మరి ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడా’.. అంటూ జగన్ వైఫల్యాలను కూడా పెళ్ళితోనే ముడిపెట్టి ఎండగట్టారు. ఇక జనసేన సోషల్ మీడియా ఖాతాలలో అయితే.. ప్రశ్న: ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు? జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రశ్న: పోలవరం ఎందుకు కట్టలేకపోయారు?, జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు, ప్రశ్న: రాజధాని మాటేంటి? మన రాజధాని ఏది? జగన్: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పార పట్టేస్తున్నారు. దీంతో జగన్ అడిగి మరీ తిట్టించుకున్నట్లే అయిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Related Posts