హైదరాబాద్, జూలై 5,
గత కొన్ని రోజులుగా కూరగాయలు, వెల్లుల్లి, అల్లం వంటి వస్తువుల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా టమాటా కిలో సెంచరీ దాటి రెండు వందల రూపాయలకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పుడు అదే బాటలో మిర్చి ధర కూడా పయనిస్తోంది. మిర్చి ధర మండిపోయింది. టమాటా ధర 100 దాటిన తర్వాత ఇప్పుడు మిర్చి కూడా మార్కెట్లో 400 రూపాయలు దాటుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో పచ్చిమిర్చి కిలో రూ.300 నుంచి 400లకు చేరింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం వర్షాకాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో పచ్చిమిర్చి ధర కిలో రూ.100 ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో సెంచరీ దాటింది. ఇక కొన్ని ప్రాంతాల్లో దాని ధర కూడా కిలో రూ.400లకు చేరుకుంది. కోల్కతాలో పచ్చిమిర్చి కిలో రూ.400కి చేరింది. ఇటీవలే వీటి ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వర్షం కారణంగా పచ్చిమిర్చి దిగుబడి తగ్గి.. మార్కెట్ లో రాక తగ్గడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.గత వారం పచ్చిమిర్చి దిగుబడి 80 టన్నులకు తగ్గింది. చెన్నైకి రోజువారీ అవసరం 200 టన్నులు. పచ్చి మిరపకాయలకు డిమాండ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చే సరుకుల ద్వారానే తీరుతుంది. అయితే పచ్చిమిర్చి కొరతతో డిమాండ్ పెరిగి ధర పెరిగింది.ఆంధ్రప్రదేశ్లోని రైతులు గత పంటలో తమ మిర్చికి మంచి ధర లభించకపోవడంతో ఇతర పంటలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఫలితంగా పచ్చిమిర్చి దిగుబడి తగ్గి.. ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.