హైదరాబాద్, జూలై 10,
ప్రభుత్వ స్థలం కేటాయిస్తే హోటళ్లు, సినిమా హాళ్లు, గోల్ఫ్ కోర్సులు, ఇతర మనోరంజక ప్రాజెక్టులు నిర్మిస్తామంటూ ఉమ్మడి రాష్ట్రంలో నమ్మబలికిన సంస్థల్లో చాలా వరకు లీజు చెల్లించడం లేదు. లాభాల్లో నడుస్తున్న హోటళ్లను కూడా టూరిజం శాఖ ప్రైవేట్కు అప్పగించింది. అలా హోటళ్లు పొందిన వాళ్లు లీజు డబ్బులను చెల్లించడం లేదు. దుర్గం చెరువులోని టూరిజం హోటల్ను ఆలీవ్ గ్రీన్ సంస్థకు లీజుకు ఇవ్వగా, సొమ్ము ఎగవేశారు. మరోవైపు హౌసింగ్ బోర్డు భూములను చాలా సంస్థలు డెవలప్ మెంట్ కు తీసుకుని, వాటా చెల్లించడం లేదు. ఇలా వివిధ వ్యాపార సంస్థల నుంచి దాదాపు మూడు వేల కోట్లు రావాల్సి ఉన్నది. కష్టకాలంలో వాటిని వసూలు చేసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం గమనరాహం.టూరిజం హోటళ్ల బకాయిలను మాఫీ చేయించేందుకు ప్రభుత్వంలోని ఓ మంత్రి లాబీయింగ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల దీనికి సంబంధించిన ఫైల్ ను మంత్రి కేటీఆర్ కు కూడా అందించినట్లు సమాచారం. లీజుకు తీసుకున్నవారంతా పేదోళ్లు, రూపాయి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని, బాకీ పడిన సొమ్మును మాఫీ చేయాలని వేడుకుంటూ ఏకంగా ఓ ఫైలునే రెడీ చేసేశారు. దీనికి లోపాయికారీగా సదరు మంత్రితో ఓ సూపర్ అగ్రిమెంట్ జరిగిందనే విమర్శలున్నాయి.కొంతమంది టూరిజం హోటళ్లను లీజుకు తీసుకుని, రెంట్స్ చెల్లించడం లేదు. నాలుగైదేండ్లుగా బాకీ ఉన్నారు. కానీ వారితో మంత్రులకు దోస్తానా ఉండటంతో.. వారి నుంచి రూపాయి కూడా వసూలు చేయలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు కూడా లీజుదారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకరిద్దరు మంత్రులకు లూటీదారులే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మంత్రుల ఇండ్లలోని పలు కార్యక్రమాలు, శుభకార్యాలకు వీరే అన్నీ సప్లై చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో లీజు వసూళ్లకు మంత్రులు వెనుకాడుతున్నారని తెలుస్తున్నదిప్రభుత్వ స్థలాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో అమ్యూజ్మెంట్ పార్క్ లు, మాల్స్, రిక్రియేషన్ సెంటర్లు, హోటళ్లను పలు సంస్థలు నిర్మించాయి. ఉమ్మడి ఏపీలో లీజు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీరు అడిషనల్ డెవలప్ మెంట్ ప్రీమియం (ఏడీపీ), లీజ్ రెంటల్స్ చెల్లించాల్సి ఉంటుంది. చాలా సంస్థలు కోట్లల్లో బాకీలు చెల్లించడం లేదు. ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించకపోతే కొన్ని సంస్థల అగ్రిమెంట్ ను రద్దు చేసుకొని, భూమిని వేరేవాళ్లకు అలాట్ చేసే అవకాశముంది. అయినా.. సర్కారు చొరవ చూపడం లేదు. ప్రభుత్వ భూములను లీజుకు తీసుకున్న స్టార్ హోటళ్లు కూడా రెంటు చెల్లించడం లేదు. ట్రెడెంట్ హోటల్ ప్రభుత్వానికి రూ. 76 కోట్లు బాకీ పడింది. గుట్టల బేగంపేటలో త్రీస్టార్ హోటల్ - హెల్త్ స్పా నిర్మాణానికి 2009లోనే అగ్రిమెంట్ చేసుకున్నా వాటి పనులు ఇంకా పూర్తి కాలేదు. దీనికి సంబంధించి రూ. 50.35 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దుర్గం చెరువులోని టూరిజం హోటల్ కూడా రూ. 10 కోట్లు బాకీ పడింది.