YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సర్వేల ఆధారంగా టిక్కెట్లు....

సర్వేల ఆధారంగా టిక్కెట్లు....

హైదరాబాద్, జూలై 18, 
కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. టికెట్ల ఖరారు, మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టిపెట్టింది. అయితే సిఫార్సులకు ఛాన్స్ లేకుండా సర్వేల ఆధారంగా టికెట్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూలంగా వాతావరణం మారుతుందని భావిస్తున్న అధిష్ఠానం... ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్ఠానం... పార్టీలో నేతల వ్యవహార శైలిపై కన్నేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, నేతల వ్యాఖ్యలపైన ఎప్పటికప్పుడు అధిష్ఠానం సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మేనిఫెస్టో మొదలు టికెట్ల ఖరారుపై తాజాగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉంటుందని, వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. ఇదే సమయంలో టికెట్ల పై ఎవరు హామీ ఇచ్చినా అంతిమ నిర్ణయం పార్టీ హైకమాండ్ దేనని నేతలకు తేల్చి చెప్పింది.తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో ఏ ఒక్క అవకాశం వదులుకోవటానికి పార్టీలు సిద్ధంగా లేవు. ఎలాగైనా అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలు స్టార్ట్ చేశారు. పార్టీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం... మినిట్ టు మినిట్ సమాచారం సేకరిస్తోంది. టీపీసీసీ చీఫ్ తో సహా ఏ స్థాయి నేత అయినా పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని సర్వే సంస్థలు అందించిన నివేదికలను బట్టి కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. దీనికి అనుగుణంగా ఏ ఒక్కరినీ విస్మరించకుండా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చేలా మేనిఫెస్టో రూపకల్పనకు సిద్ధం అవుతోంది. పేదలు, మధ్య తరగతి, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో సిద్ధం చేయాలని నిర్ణయించింది.ఇదే సమయంలో పార్టీ టికెట్ల పై కొందరు నేతలు హామీలు ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై హైకమాండ్ ఫోకస్ చేసింది. కొందరు ముఖ్యనేతలు తామే టికెట్లు ఇప్పిస్తామని చెబుతున్న మాటలను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, పార్టీ ముఖ్య నేతలకు తేల్చి చెప్పినట్లు సమాచారం. నేతల సిఫార్సులకు ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేసింది. వారసులు, అనుచరులకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని పార్టీ అధినాయకత్వం వెల్లడించింది. ప్రాంతీయ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపు మాత్రమే లక్ష్యంగా టికెట్ల ఖరారు ఉంటుందని తేల్చేసింది. ముఖ్య నేతలకు మద్దతుగా నిలిస్తే టికెట్లు ఖాయమనే భావనలో ఉన్న నేతలకు హైకమాండ్ నిర్ణయం మింగుడు పడటం లేదు. ప్రజలతో మమేకమైన నేతలకు, కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే పలుమార్లు తెలిపారు. టికెట్ల విషయంలో సిఫార్సులకు అవకాశం లేకుండా.. క్షేత్ర స్థాయి సమాచారం, పార్టీకి పనిచేసిన విధానం, ప్రజల్లో పలుకుబడి, గెలుపునకు అవకాశాలు ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ల ఖరారు ఉంటుందని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.

Related Posts