హైదరాబాద్, జూలై 24,
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుల అరెస్ట్ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 90మంది నిందితులను సిట్ అరెస్ట్ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీక్తో మొదలైన కేసు దర్యాప్తు రకరకాల మలుపులు తిరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుల సంఖ్య 100కు చేరువలో ఉంది. ఇప్పటికే ఈ కేసులో 90 మందిని సిట్ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. పేపర్ లీక్ వ్యవహారం మొదట గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాలకు మాత్రమే పరిమితం అయ్యిందని భావించినా మరో నాలుగు పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా లీకైనట్లు అధికారులు గుర్తించారు.పేపర్ లీకేజీ విషయం వెలుగు చూసిన తర్వాత ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న వారు తప్పించు కోడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు సిమ్కార్డులు మార్చేసి పుణ్యక్షేత్రాలకు తిరిగారు. చివరకు పోలీసులకు చిక్కి నేరం అంగీకరించారు. వారు ఇటీవల బెయిల్పై బయటకొచ్చారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు లభించడంతో తప్పించుకోలేమనే ఉద్దేశంతో తప్పు చేశామని ఒప్పుకుని లొంగిపోతున్నారు.కేసు దర్యాప్తు తుది దశకు చేరడంతో గత 20 రోజుల వ్యవధిలో 15 మంది తమ తప్పును అంగీకరించి లొంగిపోయారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రవీణ్, రాజశేఖర్లతో మొదలైన అరెస్టులు ఆ తర్వాత కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 90 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో 10 మందిని నెలాఖరులోగా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన వెంటనే న్యాయస్థానంలో మరో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సిట్ అధికారులు వివరించారు. ఈ ఏడాది మార్చిలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు బహిర్గతమైనట్టు బేగంబజార్ పోలీసులకు సమాచారం అందింది. ప్రాథమిక దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా తొలుత 12 మందిని అరెస్ట్ చేశారు.కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్కుమార్ను పేపర్లీక్ వ్యవహారానికి సూత్రధారిగా తేల్చారు. నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి సాయంతో పేపర్లు లీక్ చేసి విక్రయించినట్లు గుర్తించారు. కేసు సిట్కు బదిలీ అయ్యాక పోలీసులు ఇందులో ఒకరి నుంచి మరొకరికి ఉన్న లింకులను ఛేదిస్తూ 30 మందిని గుర్తించారు.కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జి శంకరలక్ష్మి డైరీ నుంచి తాను ఐడీ, పాస్వర్డ్ తస్కరించినట్టు ప్రవీణ్కుమార్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించినా, ఆమె డైరీలో ఈ వివరాలు ఉన్నట్లు ఆధారాలు లభించలేదు. దీంతో హ్యాకింగ్ ఇతర మార్గాల్లో అక్రమంగా ప్రశ్నాపత్రాలు సేకరించి ఉంటారని అనుమానిస్తున్నారు.