YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీ బీజేపీలో ఏం జరుగుతోంది....

టీ బీజేపీలో ఏం జరుగుతోంది....

హైదరాబాద్, సెప్టెంబర్ 26, 
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరిగిపోతుంటే... రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ మాత్రం అంతకంతకూ పడిపోతోంది. రాష్ట్ర బీజేపీ  నేతల్లోనూ సఖ్యత కొరవడిందని సమాచారం. బీఆర్‌ఎస్‌లో టికెట్‌ దక్కని కీలక నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. మరికొందరు కూడా హస్తంతో చెయ్యి కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచే కాదు.. బీజేపీలోని కీలక నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. అంటే... తెలంగాణ బీజేపీ  నేతలు కూడా ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరబోతున్నానా..? అంటే... జరుగుతున్న పరిణామాలు చూస్తే.. అవుననే అనిపిస్తోంది.ఈటల రాజేందేందర్‌కు జాతీయ నాయకత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నప్పటి నుంచి బీజేపీలోని ఓ వర్గం రగిలిపోతోంది. ఈటల చెప్పడం వల్లే బండి సంజయ్‌ను కూడా రాష్ట్ర  అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నది వారి ఆరోపణ. ఈటలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు... రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులుగా ఉన్న తమకు తగిన గుర్తింపు ఇవ్వకుండా అవమానిస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు. తమను సంప్రదించకుండా... కొందరిని బీజేపీలో చేర్చుకోవడం కూడా వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. వారంతా బీజేపీ  జాతీయ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. లిక్కర్‌ స్కామ్‌లో కవితను అరెస్ట్‌ చేయకపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ  చేపట్టకపోవడం కూడా బీఆర్‌ఎస్‌కు ప్లస్‌గా మారుతుందని వారి అభిప్రాయం. దీనిపై అధిష్టానం పట్టించుకోవడంలేదన్నది.. అసంతృప్త వర్గం నేతల వాదన. బీజేపీలోని ఆ అసంతృప్త నేతలంతా తరచూ రహస్య సమావేశాలు నిర్వహించడం.. హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల రెండు, మూడు సార్లు సమావేశమైన నేతలు..  ఆదివారం నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో మీటింగ్‌ పెట్టకున్నారని సమాచారం. ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి  రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావుతోపాటు పలువురు నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరంతా ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతోపాటు పార్టీ పెద్దలను కలిసి తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని భావిస్తున్నారట. జాతీయ నాయకత్వం అనుకూలంగా స్పందించకపోతే... తదుపరి కార్యాచరణపై  నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. పార్టీ వీడేందుకు కూడా సిద్ధమే అన్న సంకేతాలను పార్టీ పెద్దలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ అసంతృప్త నేతలంతా ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానంతో చర్చించిన తర్వాత... వారి రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూసుకుని...  అవసరమైతే కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యేందుకు కూడా గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. బీజేపీలోని కీలక నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని.. రాబోయే  కాలంలో కాంగ్రెస్‌లోకి చేరికలు పెరుగుతాయని టీపీసీసీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేయబోతోంది...? అసంతృప్తులను బుజ్జగిస్తుందా?  లేదా... పోతేపోని అని వదిలేస్తుందా..? అనేది ఉత్కంఠగా మారింది.
రంగంలోకి ప్రధాని మోడీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోంది. దీనిలో భాగంగా వ్యూహాలకు పదును పెట్టిన బీజేపీ అధిష్టానం.. తెలంగాణ నేతలకు కీలక సూచనలు చేసింది. ఎన్నికలకు సమయం లేదని.. ఇక స్పీడును పెంచాలంటూ అధిష్టానం ఆదేశించింది. దీని ప్రకారమే భారతీయ జనతా పార్టీ నేతలు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా, అగ్రనేతలు సైతం తెలంగాణ బాట పడుతూ ఎప్పటికప్పుడు కాషాయ పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం హైదరాబాద్ లో పర్యటించారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా.. నేతలతో భేటీ అయి ఎన్నికల కార్యచరణపై చర్చించారు. అంతేకాకుండా.. అధిష్టానం సూచనలను తప్పక పాటించాలని.. ఐకమత్యంతో ముందుకెళ్లాలని.. ఇకపై అగ్రనేతలంతా ఎప్పటికప్పుడు తెలంగాణలో పర్యటిస్తారని కూడా హామీనిచ్చారు. అయితే, బీజేపీ వ్యూహంలో భాగంగా అగ్రనేతలంతా తెలంగాణకు క్యూకట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం రంగంలోకి దిగుతున్నారు. అక్టోబరు 1న మహబూబ్‌నగర్ వేదికగా ప్రధాని మోడీ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపడంతోపాటు.. ఎన్నికలకు సిద్ధమయ్యేలా పలు సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి ఇప్పటికే టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది.అక్టోబర్ 1న  మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబ్‌నగర్‌ పట్టణ శివార్లలోని భూత్‌పూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మోడీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తోంది. అయితే, ప్రధాని మోడీ సభ ఎన్నికలకు ముందు కీలకం కానుంది. ఓ వైపు సభతో పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయడం.. మరోవైపు నేతలకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్‌గా ప్రధాని మోదీ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోదీ సభ తర్వాత బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం వెల్లడించే ఛాన్స్ ఉంది. ప్రధాని మోడీతోపాటు.. బీజేపీ అగ్రనేతలు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. మోడీ సభ అనంతరం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో, 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది.వాస్తవానికి మొదట సెప్టెంబర్‌ 28, 29 తేదీల్లోనే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తారని అందరూ భావించారు. కానీ అది వచ్చేనెలకు ఖరారు చేశారు. తొలుత అక్టోబరు 2న టూర్‌ ఖరారు చేసినా.. చివరికి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ ఒకటవ తేదీన మహబూబ్‌నగర్‌ సభలో పాల్గొంటారని తెలిపారు. పాలమూరులో ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తూ.. కమిటీలను సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను మోడీ సభకు తరలించేలా ప్లాన్ రచిస్తున్నారు.

Related Posts