హైదరాబాద్, నవంబర్ 18,
జకీయం ఇప్పుడు వ్యాపారంగా మారిపోయిందని ప్రజాస్వామిక వాదులు బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఎన్నికల ఖర్చు. సాధారణంగా ఎన్నికల్లో ఖర్చు చేయడానికి రూ. 40 లక్షల వరకూ పరిమితి ఉంది. కానీ ఈ ఖర్చు ఒక్క రోజుకు కూడా సరిపోతుందా లేదా అని లెక్కలేస్తే కష్టమే. ఖర్చులు ఊహించనంతగా పెరిగిపోయాయి. అసలు ఖర్చులు వేరు తెర వెనుక ఖర్చులు వేరు. అదీ ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో అయితే నోట్ల కట్టల వరద పారాల్సిందే. ఇప్పుడు అదే వాతావరణం చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు రూ.కోట్లు ఖర్చు చేయగల అభ్యర్థులను బరిలో దింపడంతో ఎన్నికలు చాలా ఖరీదైనవిగా మారాయి. ఒక్కో నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్లుకుపై మాటే ఖర్చు చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అర్బన్ ప్రాంతమైన శేరిలిగంపల్లి, రాజేందర్నగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు కోట్లల్లో ఉండనుందని చెప్పుకుంటున్నారు. ఇతర నియోజకవర్గాల్లో ఖర్చు యాభై కోట్లు దాటిపోతుంది. ఈ సారి రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ భారీగా ఖర్చు పెట్టబోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో ఈ సారి డబ్బు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని ఇప్పటికే చెప్పుకుంటున్నారు. తనను ఓడించడానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని సీతక్క ఆరోపిస్తున్నారు. పూర్తిగా గిరిజన ప్రాంతమైన ఆ నియోజకవర్గంలో అంత ఖర్చు పెడితే మిగతా కీలక నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. డబ్బు ఎంత ఖర్చు అనేది కాదు.. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచార కూలి నుంచి అగ్రనాయకత్వం వరకు ఎవరినీ వదలకుండా డబ్బులతో కొనుగోలు చేస్తున్నారు. కుల సంఘాలు మొదలుకుని, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతోనూ బేరసారాలు చేస్తున్నారు. వార్డు మెంబర్ల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు రేటు కడుతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారానికి పెరిగిన సాంకేతికను ఉపయోగించుకుంటున్నారు. డిజిటల్ మొబైల్స్ ద్వారా ప్రచారం మొదలు, ఇంటింటికీ కరపత్రం పంపిణీ చేసేందుకు కూలి వరకు డబ్బులు పే చేయాల్సిందే. ఒక పార్టీ అభ్యర్థి ప్రచార కూలికి రూ.500 ఇస్తే.. మరో పార్టీ అభ్యర్థి రూ. వెయ్యి ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు.ఎన్నికల ఖర్చులో తగ్గేదేలేదని అభ్యర్థులు పోటీ పడి మరీ డబ్బులు కుమ్మరిస్తున్నారు. ఇంటింటికీి పార్టీ గుర్తును, మ్యానిఫెస్టోను ప్రచారం చేసే వ్యక్తికి ఇక్కడ రోజుకు రూ. 1500 నుంచి 2000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల నియోజకవర్గాల్లో డబ్బులే రాజకీయం చేస్తున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతమైనప్పటికీ ఎన్నికల ఖర్చు అర్బన్ ప్రాంతాన్ని మించనుందని ఆయా పార్టీల శ్రేణులు చెబుతున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి సబితాఇంద్రారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ముగ్గురి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్రెడ్డి మధ్య ప్రచారంలో కాసుల వర్షం కురుస్తోంది. కొండగల్ నియోజకవర్గంలో టీపీసీసీ రేవంత్రెడ్డి గెలుపు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం కావడంతో అక్కడ కూడా డబ్బు ప్రభావం తీవ్రంగా ఉండనుంది. రేవంత్ను ఓడించేందుకు బీఆర్ఎస్ సైతం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ పోటాపోటీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.ఎన్నికల సంఘం ఐదు వందల కోట్ల వరకూ పట్టుకున్నామని లెక్కలు చెబుతోంది. కానీ అదంతా సామాన్యుల డబ్బే. రాజకీయ నేతల డబ్బు మాత్రం.. నియోజకవర్గాలకు క్షేమంగా వెళ్లిపోతోంది. ఖర్చుల్లో ఎక్కడా తగ్గకపోవడమే దీనికి సంకేతం. డబ్బు రవాణాకు ఇప్పుడు అనేక మార్గాలున్నాయి. వాటిని ఈసీ కూడా ఆపలేకపోతోంది. కానీ సామాన్యులు మాత్రం.. తనిఖీల్లో ఎక్కువ నష్టపోతున్నారు.