YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

10వేల పోలింగ్ కేంద్రాలు... సమస్యాత్మకం

10వేల పోలింగ్ కేంద్రాలు... సమస్యాత్మకం

హైదరాబాద్, నవంబర్ 23,
తెలంగాణలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 24గంటల పాటు సీసీటీవీ మానిటరింగ్ తో మూడంచెల భద్రత కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి అసాంఘీక ఘటనలు జరగకుండా గట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. మరో వారం రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఎలక్షన్ కమిషన్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించేలా చర్యలు చేపడుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటికే కేంద్ర బలగాలను తరలించింది. రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 10 వేలకు పైగా సమస్యాత్మకంగా ఉన్నట్లు ప్రకటించింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.రాష్ట్రం వ్యాప్తంగా 33 జిల్లాలు, 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 8జిల్లాల పరిధిలో 600వందలకు పైగా పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్సెస్ ను ఇప్పటికే రంగంలోకి దింపారు ఉన్నతాధికారులు. భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, యెల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ బలగాలను తరలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 250కి పైగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 166 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే అత్యంత సమస్యాత్మకంతో పాటు మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్ల వద్ద క్విక్ రియాక్షన్ టీమ్స్ ను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపనున్నారు. ఫ్లెయింగ్ స్క్వాడ్లను ఆయా ప్రాంతాల్లో మోహరించనున్నారు. ప్రచారంలో కొన్నిచోట్ల వేర్వేరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడం, బాహాబాహీలకు దిగడంతో ఒకే రోజు ఒకే ప్రాంతంలో అన్ని పార్టీల ర్యాలీలకు సభలకు అనుమతి రద్దు చేసింది ఎలక్షన్ కమిషన్. ఇక పోలింగ్ కు వారం రోజులే మిగిలి ఉండటంతో బందోబస్తును మరింత పటిష్టం చేయాలని అధికారులు నిర్ణయించారు.ఈసారి జరిగే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది చీఫ్ ఎలక్షన్ కమిషన్. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం వెళ్తున్న కమిషన్, రాబోయే రోజులు మరింత కీలకం కావడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.

Related Posts