YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో డ్యూయల్ ఓటు రచ్చ

 ఏపీలో డ్యూయల్ ఓటు రచ్చ

విజయవాడ, డిసెంబర్ 8,
తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారి వ్యవహారం ఇప్పుడు ఏపీలో రాజకీయ అంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కలిగి ఉన్న వారికి స్వస్థలంతో పాటు ఉద్యోగం, ఉపాధి, విద్యాభ్యాసం కోసం తెలంగాణలో స్థిరపడిన ప్రదేశంలో కూడా ఓటు హక్కును పొందారు. ఇలా ఏపీ స్థానికత కలిగిన వారిలో ఎందరికి తెలంగాణలో ఓటు హక్కు ఉందనే విషయంలో అధికారిక లెక్క లేకపోయినా రకరకాల అంచనాలు మాత్రం ఉన్నాయి. 2018లోనే ఈ అంశం తెరపైకి వచ్చినా అప్పట్లో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని చూసి చూడనట్టు వ్యవహరించింది.2018 చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరిగాయి. భౌగోళిక సరిహద్దులు, నియోజక వర్గాల ఆధారంగా రెండు రాష్ట్రాలకు ఫలితాలను వెల్లడించారు. 2018లో మాత్రం ఆర్నెల్ల ముందే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.2018 ఎన్నికల నాటికి తెలంగాణలో దాదాపు 30లక్షల మంది ఆంధ్రా స్థానికత కలిగిన వారు ఉంటారని అంచనాలు ఉన్నాయి. వారిలో 8 నుంచి 12లక్షల మందికి తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఓటు హక్కు ఉందని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. అయితే ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండటంపై పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఇది ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేసినా ఈసీ చేతులెత్తేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలు జరగవు కాబట్టి పెద్దగా నష్టం ఉండదని అప్పట్లో ఏపీలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేసిన గోపాల కృష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. ఓటు హక్కును నిరాకరించడానికి సహేతుకమైన కారణాలు ఉండాలని పేర్కొన్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో మళ్లీ ఓట్ల విషయంలో మళ్లీ అలజడి మొదలైంది. గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతలు ఎన్నికల సంఘం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన 40లక్షల మంది నివసిస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. దాదాపు పది లక్షల మందికి ఏపీలో ఓటు ఉంటుందని అనుమానిస్తున్నారు.డిసెంబర్‌ చివరి నాటికి దేశవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండటంతో రాజకీయ పార్టీలు ఓట్ల తొలగింపుకు హడావుడి మొదలుపెట్టాయి. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సి ఉంది.ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటనకు ముందే రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించి తొలగించాలని అధికార వైసీపీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర ఓటర్లు ఏపీలో ఓటు హక్కును వినియోగించు కోడానికి వస్తారని ఆ పార్టీ అనుమానిస్తోంది. నవంబర్ 30వ తేదీ నాటికి తెలంగాణ ఓటర్ల జాబితాలో ఓటు హక్కు ఉన్న వారిని ఏపీలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయకుండా చూడాలని ఈసీకి ఫిర్యాదు చేసింది.జాబితాలో ఉన్నా, స్థానికంగా నివసించని వారి ఓటును ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉన్నా రకరకాల కారణాలతో బిఎల్వోలు తొలగించకుండా వదిలేస్తున్నారు. ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓట్లను స్థానికంగానే కొనసాగించడంపై రకరకాల ఒత్తిళ్లు ఉంటున్నాయి.స్థానిక నేతల ఒత్తిడితో పాటు ఓటర్ల వినతులతో వాటిని కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స‌్థానికత ధృవీకరణ కోసం ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉంటున్నా మిగిలిన రాష్ట్రాలతో పెద్దగా సమస్య లేదని ఎన్నికల సంఘం చెబుతోంది.ప్రధానంగా ఆంధ్రా ఓటర్లకు తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఓటు ఉండటమే సమస్యగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఓటు వేసిన వారిని తిరిగి ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేయకుండా చూడాలని ఫిర్యాదులు అందడంతో దానిపై ఏమి చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.తెలంగాణాలో ఓటు వేసిన వారిని తిరిగి ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేయకుండా చూడాలని కోరుతూ వైసీపీ తరపున వినతిపత్రం అందించారు. మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, జోగి రమేష్ , శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి,పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి సీఈఓ మీనాను కలసి ఫిర్యాదు చేశారు.

Related Posts