YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కులగణన మళ్లీ వాయిదా

కులగణన మళ్లీ వాయిదా

విజయవాడ, డిసెంబర్ 8,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కులగణన ప్రక్రియ మరోసారి వాయిదా వేసింది. ముందుగా నవంబర్ 27వ తేదీ నుంచి కులగణన ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పూర్తిగా డిజిటల్ విధానంలో ప్రక్రియ చేపట్టేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక యాప్ ద్వారా డోర్ టు డోర్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. కులగణన ఎలా చేపట్టాలి? ఇంటింటికీ వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలి? వంటి అంశాలపై అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు ఆధ్వర్యంలో కులగణన జరిగేలా అంతా సిద్ధం చేశారు. మరోవైపు కులసంఘాల, నిపుణులతో జిల్లావారీగాను, ప్రాంతీయ సమావేశాలు కూడా నిర్వహించారు.విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూల్, తిరుపతిలో ప్రాంతీయ సమావేశాలు పూర్తయ్యాయి. మరోవైపు పైలెట్ ప్రాజెక్టుగా ఐదు సచివాలయాల పరిధిలో సర్వే కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వం కులగణన వాయిదా వేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత చివరి నిమిషంలో కులగణన ప్రక్రియ డిసెంబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రకటించారు. దీనికి కారణాలు కూడా చెప్పుకొచ్చారు. కుల సంఘాలు, నిపుణులతో ప్రాంతీయ, జిల్లాస్థాయి సమావేశాల్లో అనేక అభిప్రాయాలు తీసుకున్నామని, మరింత పక్కాగా చేపట్టేలా మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. ఈ సమావేశాల ద్వారా వచ్చే అభిప్రాయాల మేరకు సర్వే చేస్తామని చెప్పారు. ఈ నెల 9 నుంచి ప్రారంభం కావాల్సిన సర్వేను తాజాగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త తేదీ మాత్రం ఎప్పుడనేది చెప్పలేదు.వాస్తవంగా నవంబర్ 27 వ తేదీ నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అది కాస్తా డిసెంబర్ 9 వ తేదీకి వాయిదా పడింది. తాజాగా మరోసారి సర్వే ను వాయిదా వేసింది సర్కార్. దేశంలో బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాత్రమే కులగణన చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఆరుగురు అధికారుల కమిటీని నియమించింది..కమిటీ బీహార్ లో పర్యటించి అక్కడ కులగణన జరిగిన విధానంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిటీ నివేదిక ఆధారంగా కేబినెట్ కూడా కులగణన చేపట్టేందుకు ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయం తర్వాత ప్రక్రియను వేగవంతం చేసింది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా కులగణన వాయిదా వేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ చెప్పారు. తుఫాన్ కారణంగా జరిగిన పంటనష్టం పై అధికార యంత్రానంగం నిమగ్నమై ఉందని, ఈ సమయంలో తుపాన్ నష్టం, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి వేణుగోపాల్ అన్నారు. కేవలం తుఫాన్ కారణంగానే వాయిదా వేశాం తప్ప వేరే కారణాలు లేవన్నారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు కుదుటపడిన తర్వాత త్వరలో కులగణన తేదీని ప్రకటిస్తామన్నారు. సర్వేకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావడంతో ఆలస్యంగా ప్రక్రియ ప్రారంభించినా వారం రోజుల్లోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతుంది

Related Posts