YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతలో మట్టి మాఫియా

అనంతలో మట్టి మాఫియా

అనంతపురం, డిసెంబర్ 9,
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మట్టి మాఫియా రాజ్యమేలుతోంది. కాంట్రాక్టర్ల వద్ద నుండి వసూలు చేస్తున్న సీనరేజీని ఏమాత్రం ప్రభుత్వానికి చెల్లించకుండా ఏకంగా అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తూ డబ్బును దండుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా గనుల శాఖ చోద్యం చూస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అమిగోస్ సంస్థకు సీనరేజీని వసూలు చేయడానికి బాధ్యతలు మార్చి నెల నుండి అప్పజెప్పింది. మట్టి తవ్వుతున్న కాంట్రాక్టర్ల నుండి సీనరీజని వసూలు చేసి నెలకు దాదాపు 11 కోట్ల రూపాయలను గనుల శాఖకు చెల్లించాలని ఆదేశించింది. కానీ, ఒప్పందం ప్రకారం ఏ నెల కూడా ఆ మేరకు చెల్లించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ పనులకు మాత్రమే మట్టి తవ్వకాలకు తాత్కాలిక పర్మిట్లు ఇస్తారు. కాంట్రాక్టర్లు చేస్తున్న పనుల వివరాలను తీసుకుని తాత్కాలిక పర్మిట్లు మంజూరు చేయాలి అయితే అమిగోస్ సంస్థకు సంబంధించిన కొంతమందికి ఆ సంస్థ తాత్కాలిక పర్మిట్లు మంజూరు చేసినట్టు.. తద్వారా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుక్కరాయసముద్రంలో సర్వే నంబర్ 113, ఆత్మకూరు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 290, పెద్దపప్పూరు మండలంలోని జూటూరు సర్వేనెంబర్ 1-281, పామిడి మండలంలోని వంక రాజ కాలువ గ్రామ పరిధిలో సర్వే నంబర్ పేర్కొనకుండానే తాత్కాలిక పర్మిట్లు మంజూరు చేశారు. ఆత్మకూరులో రాజశేఖర్ వంక రాజు కాలువలో ప్రవీణ్ కుమార్ పేరున తాత్కాలిక పర్మిట్లు మంజూరు అయ్యాయి.అయితే, ఈ ఇద్దరికీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టులు లేవని సమాచారం. అయినా హంపాపురం, నర్సినేకుంట, బుక్కరాయసముద్రం, నరసాపురం, యల్లనూరు, మండలాల్లో యదేచ్చగా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలను జరిపారు. వారిద్దరూ కూడా అమిగో సంస్థకు చెందిన వారే అని ఆయా గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు.అయితే, తవ్వకాలకు అనుమతులు ఉన్నా కూడా తవ్వకాలు జరపకూడదంటూ అమిగోస్ సంస్థ ప్రతినిధులు దౌర్జన్యం చేస్తున్నారని లీజు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయిందని చెబుతున్నారు. లీజుదారుడుని అయినప్పటికీ తవ్వకాలు జరుపుకున్నా సీనరేజి కట్టాలని అమిగో సంస్థ ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారంటూ గుంతకల్లులో ఐదవ వార్డ్ నెంబర్ కుమారుడు దర్గా రమేష్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీటిపై గనుల శాఖ అధికారులను సమాచారం కోసం ప్రయత్నించిన వారి వద్ద నుండి ఎటువంటి స్పందన రావడం లేదు.

Related Posts