హైదరాబాద్
పుష్కరకాలంగా నిలిచిపోయిన జోనల్ క్రికెట్ను పునరుద్దరించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం చర్యలు తీసుకుందని హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు వెల్లడించారు. శనివారం ఉదయం సికింద్రాబాద్లోని జింఖానా స్టేడియంలో పురుషుల సీనియర్ జోనల్ టోర్నమెంట్లోని సెక్రటరీ ఎలెవన్ వర్సెస్ సికింద్రాబాద్ ఎలెవన్ తొలి మ్యాచ్ను జగన్మోహన్రావు టాస్ వేసి ప్రారంభించారు. టాస్కు ముందు జగన్మోహన్ రావు ఇరు జట్ల ఆటగాళ్లతో కరచాలనం చేసి, ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ క్రికెటర్లను ఖాళీగా ఉంచకుండా ఏడాది పొడువునా ఏదొక టోర్నమెంట్లో ఆడించాలనేది తమ అభిమతమన్నారు. త్వరలో జూనియర్ లెవల్లో కూడా జోనల్ స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు. ఏడాదికి సుమారు ఆరు వేల మ్యాచ్లు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని, ఇందు కోసం కొత్త మైదానాలను కూడా సిద్ధం చేస్తామని చెప్పారు.
గ్రామీణ క్రికెటర్లకు అగ్రతాంబుళం
హెచ్సీఏ అంటే కేవలం హైదరాబాద్కే పరిమితం కాదు, విశ్వనగరంతో పాటు 33 జిల్లాల్లోనూ క్రికెట్ను సమంతరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జగన్మోహన్రావు చెప్పారు. ఇకపై జిల్లాల్లోనూ క్రికెట్ టోర్నమెంట్లు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం హెచ్సీఏ జట్లలో గ్రామీణ క్రికెటర్లకు అగ్రతాంబుళం ఇస్తా, అన్ని జట్లలో 50 శాతానికి పైగా రూరల్ క్రికెటర్లకు అవకాశం దక్కేలా చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు.
పూర్వ వైభవం తీసుకొస్తాం..
హెచ్సీఏ కొత్త కార్యవర్గంలో అనుభవజ్ఞులు ఉన్నారని, అలాగే మాజీ క్రికెటర్ల సలహాలు, సూచనలతో సమష్ఠిగా పనిచేసి, దేశంలోనే నెంబర్ వన్ అసోసియేషన్గా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఎం ఎల్ జైసింహా, మహ్మద్ అజరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజ క్రికెటర్లు జింఖానాలో ఆడి, ప్రపంచ మేటి క్రికెటర్లుగా ఎదిగిన చరిత్ర మనకుందని, ఆ పునర్వైభావాన్ని తిరిగి తీసుకొస్తామన్నారు. అనంతరం హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్స్లెన్స్ సిబ్బందితో కలిసి జింఖానాలో ప్రాక్టీసు నెట్స్ ఏరియా, జిమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రాక్టీసు చేస్తున్న యువ క్రికెటర్లతో జగన్ ముచ్చటించి, సదుపాయాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ సీఈఓ సునీల్, హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్స్లెన్స్ డైరెక్టర్ విజయ మోహన్, కోచింగ్ సిబ్బంది వివేక్ జై సింహ, బిజు, అభిజీత్, క్యూరేటర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.