కరీంనగర్: జిల్లాలోని మానకొండూరు మండలం చంజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒక వ్యక్తి మృతి చెందాడు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను తీసేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అతి వేగంతో లారీ ఓవర్టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు కుడి భాగం నుజ్జునుజ్జయింది. కిటికి వద్ద కూర్చున్న వారంతా మృతి చెందారు. ప్రమాదంలో బస్సు వెనకాల బైక్ లపై వస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం తెలియగానే, మంత్రి ఈటల రాజేందర్ అక్కడికి చేరుకున్నారు. మంత్రి మాట్లాడుతూ గాయపడిన వారందరికీ ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యసేవలు అందిస్తాం. అవసరం అయితే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తామన్నారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించాలి. ప్రమాద నివారణ కు చర్యలు తీసుకుంటామని అయన అన్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వ్యైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.