హైదరాబాద్, జనవరి 2,
కొత్తేడాదికి ప్రజలంతా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ గట్టిగా చేసుకున్నారు. డిసెంబర్ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్లో వేడుకలు జరిగాయో అర్థమవుతోంది. మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఇక బార్లు, పబ్బులు ప్రజలతో కిటకిటలాడాయి. ఇదిలా ఉంటే కొత్తేడాదికి ఆహ్వానం పలికే సమయంలో బిర్యానీలతో పాటు, కండోమ్స్ అమ్మకాలు సైతం భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తెలిపింది.కొత్తేడాది వేడుకల సమయంలో ఒక్క హైదరాబాద్లోనే ఏకంగా 4.8 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో వచ్చిన ఆర్డర్ల కంటే 1.6 రెట్లు ఎక్కువ ఆర్డర్లు రావడం విశేషం. హైదరాబాద్లో ప్రతీ నిమిషానికి 1244 ఆర్డర్లు వచ్చాయి. చివరి గంటలో సుమారుగా 10 లక్షల మంది స్విగ్గీ యాప్ను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. న్యూఇయర్ వేడుకల సమయంలో ప్రతి గంటకు 1,722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఇన్స్టామార్ట్ తెలిపింది.ఇదిలా ఉంటే డిసెంబర్ 31న రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళాదుంపలు ఆర్డర్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉంటే కేవలం ఫుడ్ మాత్రమే కాకుండా కొత్తేడాది వేళ ఓయో రూమ్ బుకింగ్స్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూమ్స్ బుకింగ్ 37 శాతం పెరిగాయి. డిసెంబర్ 30, 31 తేదీల్లోనే ఏకంగా 2.3 లక్షల ఓయో రూమ్స్ బుక్ కావడం విశేషం. ఎక్కువగా ఆయోధ్యలో గదులు బుక్ చేసుకున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోల్చితే.. అయోధ్యలో 70 శాతం అధికంగా, గోవాలో 50%, నైనీతాల్లో 60%ఎక్కువగా రూమ్స్ బుక్ అయినట్లు ఓయో తెలిపింది.జొమాటోలో కూడా భారీగా ఆర్డర్లు వచ్చాయని ఆ కంపెనీ తెలిపింది. దాదాపు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఇయర్ ఎండ్లో సేవలు అందించారని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఏకంగా 2.5 లక్షల పిజ్జాలు అమ్ముడు పోయినట్లు స్విగ్గీ పేర్కొంది.