హైదరాబాద్, జనవరి 4,
ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అంగీకరించలేకపోతోందని ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి. ప్రజలు పొరపాటున కాంగ్రెస్ కు ఓటేశారని తమను ఓడించి తప్పు చేశామని బాధపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. తమకు , కాంగ్రెస్ రెండు శాతం ఓట్ల తేడానేనని గట్టిగా వాదిస్తున్నారు. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ చానళ్లు పెట్టుకోవాల్సిందని కేటీఆర్ నిట్టూరుస్తున్నారు. కానీ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ హైకమాండ్ తీరు తప్పుల్ని దిద్దుకునేలా కనిపించడం లేదన్న అభిప్రాయానికి పార్టీ నేతలు రావడానికి కారణం అవుతోంది. అయితే లోతుగా విశ్లేషిస్తే గ్రేటర్ లో తప్ప.. మిగిలిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఏకంగా పది శాతానికిపైగా ఓట్ల తేడాతో వెనుకబడిందని రికార్డులు చెబుతున్నాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రెండు కంటే తక్కువ శాతం ఓట్ల తేడా ఉందని ఆ మార్పు రావడానికి ఎంతో కాలం పట్టదని బీఆర్ఎస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. కేటీఆర్ పదే పదే ఈ రెండు శాతం తేడా ఓట్ల సిద్దాంతాన్ని చెబుతున్నారు. ప్రజలు తప్పు చేశారన్నట్లుగా మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తాయి. వాళ్లకు అవకాశం ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం భిన్నపరిస్థితులు నెలకొన్నాయి. బీఆరెస్ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నది. ప్రజలకు తాము ఎంతో చేసినా మమ్మల్ని ఆదరించలేదని వాపోతున్నది. వాస్తవాలను విస్మరిస్తే అవి మరో రూపంలో ముందుకు వస్తాయన్న వాస్తవాన్ని గత పాలకులు ఇప్పటికీ అంగీకరించడం లేదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో కనీ వినీ ఎరుగని అభివృద్ధి చేశామని అయినా ప్రజలు ఓడగొట్టారని .. వాళ్లకు మంచి చేయకుండా యూట్యూబ్ చానళ్లు పెట్టుకున్నా గెలిచేసేవారమని కేటీఆర్ నిట్టూర్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తీరు చూస్తూంటే… ఆయన ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని సులువుగానే అర్థమవుతుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో అభివృద్ధి అనే ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే చరిత్రలో కొంత మంది నేతలకు ఓటమి అనేదే ఉండకూడదు. అయినా వారెవరూ తాము అభివృధ్ధి చేయకుండా కుల రాజకీయాల్ని చేసి ఉంటే గెలిచి ఉండేవాళ్లమని అనుకోలేదు. మరోసారి కష్టపడి ప్రజల మనసుల్ని గెలుచుకనే ప్రయత్నం చేశారు. ఇలా బీఆర్ఎస్ కూడా రియలైజ్ కావాల్సింది.. ఇంకా.. తమకు అనుకూలమైన లెక్కలు వేసుకుని సంతృప్తి పరుచుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఓటింగ్ పర్సంటేజీ విషయంలోనూ కేటీఆర్ ఆత్మవంచన చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. రెండు శాతం కన్నా తక్కువ ఓట్లతో అధికారం కోల్పోయామనుకుంటున్నారు. కానీ వారు చెప్పింది నిజం కాదని.. గ్రేటర్ హైదరాబాద్ ను మినహాయిస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పది శాతానికిపైగా ఓట్ల తేడా కనిపిస్తోందని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి 92,35,792 ఓట్లు వచ్చాయి. ఇది 39.40 శాతం. ప్రతిపక్ష బీఆరెస్కు 87,53,924 ఓట్ల పోలయ్యాయి. అంటే 37.35 శాతం. తేడా కొద్దిగానే కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ కు ఆయువపట్టు లాంటి చోట్ల పునాదులు కదిలిపోయాయనే సంగతిని మార్చిపోతున్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ కలిపి కాంగ్రెస్కు 83,10,792 ఓట్లు వచ్చాయి. బీఆరెస్కు 71,76,924 ఓట్లు లభించాయి. అంటే ఈ రెండు రీజియన్లలో బీఆరెస్కంటే కాంగ్రెస్కు 11,33,868 ఓట్లు అధికంగా పోలయ్యాయి. కానీ ఈ తేడా తక్కువ కనిపించడానికి గ్రేటర్ హైదరాబాద్ కారణం. హైదరాబాద్ రీజియన్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు 25.53 శాతం మాత్రమే. బీఆరెస్కు వచ్చిన ఓట్లు 38.97 శాతం. అంటే... హైదరాబాద్ పక్కన పెడితే... కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పది శాతం ఓట్ల తేడా కనిపిస్తోంది. దీన్ని గుర్తించడానికి బీర్ఎస్ సిద్దపడలేకపోతోంది. ఈ ఓట్ల తేడాలు విశ్లేషించుకున్న తరవాత లోపాలు సవరించుకుని ప్రయత్నిస్తే.. ముందుకు వెళ్తామని ఆత్మవంచన చేసుకుంటే.. ఇంకా ఇంకా నష్టపోతామని పలువురు నేతలు అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేస్తున్నారు. కేటీఆర్ నిష్ఠూరాలు అలాగే ఉంటే.. ఇక ఎప్పటికీ కోలుకోలేకపోవచ్చునని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ప్రజాస్వామ్య రాజకీయాలు అంటే అంతే. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు.. ఎందుకు తిరస్కరిస్తారో అంచనా వేయలేం. అయితే తెలంగాణలో ప్రజలు కేటీఆర్, కేసీఆర్ లను వద్దనుకోవడానికి .. అభివృద్ధి కారణం కాదు. ఈ విషయంలో ప్రజలు బీఆర్ఎస్ కు మేలైన మార్కులు వేస్తారు. అయినా అధికారంలో ఉండకూడదని కోరుకున్నారు. దానికి కారణం ఖచ్చితంగా యూట్యూబ్ చానళ్లు పెట్టలేకపోవడం కాదు. ఎందుకంటే.. కాంగ్రెస్ కు పది శాతం మీడియా.. ఆన్ లైన్ మీడియా సపోర్ట్ ఉంటే.. మిగతా 90 శాతం బీఆర్ఎస్కే ఉంది. లోపాలు ఎనాలసిస్ చేసుకుంటే… మళ్లీ తిరిగి పోరాడవచ్చు.. లేకపోతే.. ఇలా నిరాశపడుతూనే ఉండిపోతారనేది రాజకీయ పరిశీలకులు చెప్పే మాట.