YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో కొత్త హుషారు

వైసీపీలో కొత్త హుషారు

విజయవాడ, జనవరి 27,
ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో కొత్త హుషారు క‌న‌ప‌డుతోంది. నిన్నటి వ‌ర‌కూ అల‌క‌బూనిన మల్లాది విష్ణు కూడా పార్టీ నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించడంతో బెజ‌వాడ‌లో మ‌ళ్లీ స‌త్తా చాటుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈనెల 30 జిల్లా పార్టీ కేడ‌ర్‌తో సీఎం జ‌గ‌న్ నిర్వహించే స‌మావేశానికి సైతం భారీగా త‌ర‌లివెళ్లేలా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట‌గా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ దూసుకుపోయింది. ఈసారి కూడా గ‌త ఎన్నికల ఫ‌లితాలే పున‌రావృతం అయ్యేలా అధిష్టానం జిల్లాపై ముందు నుంచే ఫుల్ ఫోక్స్ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌ల‌కు సీట్లు నిరాక‌రించింది వైసీపీ అధిష్టానం. పెన‌మ‌లూరు ఎమ్మెల్యే పార్థసారథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, విజ‌య‌వాడ సెంట్రల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు స్థానంలో కొత్త ఇంచార్జిల‌ను నియ‌మించింది.విజ‌య‌వాడ సెంట్రల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు స్థానంలో ప‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. పార్ధసారథి, రక్షణ నిధిలు పార్టీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. మ‌ల్లాది విష్ణు మాత్రం మౌనంగా ఉండిపోయారు. వెలంప‌ల్లికి స‌హ‌కారం అందించేది లేనిది కూడా స్పష్టంగా చెప్పలేదు. విష్ణుతో ప‌లుమార్లు వెలంప‌ల్లి భేటీ అయిన‌ప్పటికీ ఆయ‌న నుంచి ఎలాంటి హామీ రాలేదు. చివ‌ర‌కు సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్దిపై వెలంప‌ల్లి విజయవాడ కార్పొరేట‌ర్లతో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు కూడా మ‌ల్లాది హాజ‌రుకాలేదు. దీంతో అస‌లు మ‌ల్లాది విష్ణు ఏం చేయ‌నున్నార‌నే అనుమానం మొద‌లైంది. విష్ణు లేకుండానే సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ బాధ్యతలు చేప‌ట్టిన వెలంపల్లి డివిజ‌న్ పర్యటనలు మొద‌లుపెట్టారు. అప్పటికే విష్ణు వెంట ఉండే కార్పొరేట‌ర్లు చాలామంది వెలంప‌ల్లికి మ‌ద్దతు ప్రకటించారు. సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న కొత్త కార్యాల‌యం ప్రారంభోత్సవానికి విష్ణును వెలంప‌ల్లి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి కొన్ని గంట‌ల ముందు మ‌ల్లాది విష్ణు త‌న అనుచ‌రులు,పార్టీ నాయ‌కులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. వెలంపల్లికి స‌హ‌కిరంచేది లేద‌ని చాలామంది మల్లాదు సన్నిహితులు చెబుతున్నా.. మ‌ల్లాది విష్ణు మాత్రం మెట్టు దిగారు. పార్టీ నిర్ణయమే త‌న‌కు శిరోధార్యం అని కార్యకర్తలకు తేల్చి చెప్పారు. దీంతో మ‌ల్లాది మెత్తబడిపోయారు. అన్ని ఊహాగానాల‌కు చెక్ పెడుతూ వెలంప‌ల్లి కొత్త కార్యాలయ ప్రారంభోత్సవానికి మ‌ల్లాది విష్ణు హాజ‌ర‌య్యారు. పార్టీ కొత్త ఆఫీస్ వద్దకు వ‌చ్చిన మ‌ల్లాది విష్ణు, వెలంప‌ల్లి ఒక‌రినొక‌రు ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నారు. ఈ సీన్ తో సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీలో నెలకొన్న అన్ని గొడ‌వ‌ల‌కు ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది. ఇదే వేదిక‌పై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామ‌కృష్ణా రెడ్డితో పాటు ఎంపీ కేశినేని నాని, ఇత‌ర ముఖ్య నేత‌లు కూడా ఉన్నారు. విష్ణుకు మ‌రింత పెద్ద బాధ్యతలు అప్పగించనున్నట్లు సజ్జల చెప్పారు.మ‌రోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు, కైక‌లూరు మిన‌హా మిగిలిన నియోజ‌కవ‌ర్గాల ఇంచార్జిలు, ప‌రిశీల‌కులతో రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈనెల 27 నుంచి సీఎం జ‌గ‌న్ రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో కేడ‌ర్‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసారు. ప‌లు జిల్లాల‌ పార్టీ శ్రేణులను క‌లిపి ఒక‌చోట స‌మావేశం అవుతారు. దీంట్లో భాగంగా ఈనెల 30న ఏలూరులో వైసీపీ ప్రాంతీయ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఈ స‌ద‌స్సులో ఉమ్మడి ప‌శ్చిమ గోదావ‌రి,ఉమ్మడి కృష్ణా జిల్లాల కేడ‌ర్‌తో సీఎం స‌మావేశం కానున్నారు. ఆ జిల్లాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న గృహ‌సార‌ధులు, గ్రామ‌స్థాయి ముఖ్య నాయ‌కులు, క్రియాశీల‌క కార్యకర్తలు ఈ సమావేశానికి హాజ‌రుకానున్నారు. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌దివేల మంది పార్టీ ప్రతినిథులు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యేలా చూడాల‌ని ఈ స‌మావేశంలో నేత‌లు దిశానిర్ధేశం చేశారు. కేడర్ ను సీఎం జ‌గ‌న్ దగ్గర చేసుకోవ‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుపై వారికి దిశానిర్ధేశం చేస్తార‌ని ఆ పార్టీ నేత‌లు చెప్పారు. సీఎం జ‌గ‌న్ ప్రాంతీయ స‌మావేశానికి ముందు జిల్లాలో మొత్తం ప‌రిస్థితులు చక్కబ‌డ్డాయ‌ని వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 స్థానాల్లో మొత్తం 14 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. తిరిగి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఇదే రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు ఆ పార్టీ నేత‌లు.

Related Posts