మహిళా శిశు సంక్షేమ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం.. తాజాగా అధికారులు, సిబ్బందిని పనితీరును మరింత మెరుగుపర్చాలని భావిస్తోంది.. జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు పారదర్శకమైన సేవలు అందించేందుకు ముందడుగు వేసింది.జిల్లా, ప్రాజెక్టు కార్యాలయాల్లో అధికారుల హాజరు శాతాన్ని పెంచేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. శిశు సంక్షేమశాఖలో కొత్తగా రూపొందించిన అధికారుల సందర్శన పర్యవేక్షణ యాప్ను, బయోమెట్రిక్ విధానాన్ని హైదరాబాద్లోని ఆ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి విషయం యాప్లో అప్లోడ్ చేయగానే డైరెక్టర్ కార్యాలయం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని ఓ అధికారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు, అధికారుల పర్యవేక్షణ పని విధానంపై ఉన్నతాధికారుల దృష్టి ఉంటుంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులు కొరడా ఝులిపిస్తారు.కొందరు కార్యాలయానికి రాకుండానే టూర్ వెళ్లినట్లు చెప్పి వారి సొంత పనులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరు సమయపాలన పాటించకుండా ఆలస్యంగా రావడం, సమయానికంటే ముందుగానే ఇళ్లకు వెళ్లేవారు. బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుతో అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించడంతో పాటు విధులకు ఎగనామం పెట్టే పద్ధతికి చెక్ పెట్టినట్లవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాలకు బయోమెట్రిక్ డివైజ్లు అందినట్లు తెలిసింది. వరంగల్ రూరల్ జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయంతో పాటు నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల ప్రాజెక్టు కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఇటీవలే బయో మెట్రిక్ హాజరు ప్రారంభమైంది. మిగలిన జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.