YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఐఆర్ ఆర్ కేసులో బాబుకు ఊరట

ఐఆర్ ఆర్ కేసులో బాబుకు ఊరట

న్యూఢిల్లీ, జనవరి 29
టీడీపీ అధినేత చంద్రబాబుకు  భారీ ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు  చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని తెలిపింది. జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం పిటిషన్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం ఈ కేసులో నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. '2022లో ఈ కేసుపై ఎస్ఎల్ పీ దాఖలైంది. అందువల్ల 17ఏ నిబంధన వర్తిస్తుందా.?' అని ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు, ఈ కేసుకూ సంబంధం ఉందా అని ఆరా తీసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ.. పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని కోర్టుకు తెలిపారు. సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. అది ఎలా వర్తిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది.చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న ఇతర కేసుల వివరాలను ధర్మాసనం కోరగా.. ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అందజేశారు. అన్ని వివరాలను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. మిగిలిన కేసుల్లోనూ సాధారణ బెయిల్ మంజూరైంది కదా అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. కొన్ని కేసుల్లో సాధారణ, మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని చెప్పారు. ఐఆర్ఆర్ కేసులో సహ నిందితులు బెయిల్ పై ఉన్నప్పుడు చంద్రబాబు కూడా బయట ఉంటే నష్టమేంటని ప్రశ్నించిన ధర్మాసనం.. వారిపై ఉన్న ఉత్తర్వులు ఆయనకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ఇన్నర్‌రింగ్ నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా భూసేకరణ చేపట్టింది. అయితే, భూసేకరణపై విచారణ చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని.. తమకు కావాల్సిన వారికి అనుకూలంగా ఎలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపించింది. ఈ కేసులో చంద్రబాబును బాధ్యుడిని చేస్తూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు సీఐడీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం కొట్టివేసింది. దీనిపై ఆయన రాష్ట్ర హైకోర్టులో అప్పీలు చేయగా సుదీర్ఘ విచారణ అనంతరం ఈ నెల 10న చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నేరాభియోగాలు నిరూపించే వరకు ఆయన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది.అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయనపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని.. వాటికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ ఏపీ సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది. చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరింది. దీంతో పాటు మద్యం, ఇసుక కుంభకోణం కేసుతోపాటు స్కిల్ డెలప్‌మెంట్‌ కేసుల్లో ఆయన బెయిల్‌పై బయటే ఉన్నారని తెలిపింది. దీనిపై విచారించిన కోర్టు ఏపీ ప్రభుత్వం పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.

Related Posts