YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీట్లపై ఇంకా రాని క్లారిటీ

సీట్లపై ఇంకా రాని క్లారిటీ

విజయవాడ, ఫిబ్రవరి  6,
ఏపీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిన టీడీపీ, జనసేనలు.. అభ్యర్ధుల ఎంపికపై దృష్టిపెట్టాయి. ఇదే అంశంపై ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రెండు పార్టీల అధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నిన్న మధ్యాహ్నం 3గంటల పాటు సమావేశమైన లీడర్లు.. రాత్రి మరోసారి సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. 45నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఇరుపార్టీలు.. దాదాపు స్పష్టతకు వచ్చాయి. ఈ నెల 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత.. బహిరంగ సభలో మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే మూడుసార్లు సమావేశమైన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై విడతలవారీగా చర్చించారు. నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌.. ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజాగా ఉండవల్లిలో భేటీ అయిన ఇద్దరు అధినేతలు.. కీలక అంశాలపై చర్చించారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు.. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనున్నారు.మండపేట, అరకు స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే స్పష్టత నిచ్చిన చంద్రబాబు.. ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను కూడా ప్రకటించారు. దానికి పోటీగా.. రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్‌ కల్యాణ్. దీంతో మిగిలిన సీట్లపై స్పష్టత రావాల్సి ఉంది. కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు.. పార్టీ, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే సిట్టింగ్ స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలకే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో పట్టు, విడుపులకు సిద్ధంగా ఉన్నట్టు సిగ్నల్‌ ఇచ్చారు చంద్రబాబు.అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వరుస జాబితాలు ప్రకటిస్తుండటంతో టీడీపీ-జనసేన నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బీజేపీతో పొత్తు అంశం ఎటూ తేలకపోవడం వల్లే సీట్ల ప్రకటన ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. తాను ఇప్పటికీ ఎన్డీఏలోనే ఉన్నానని పవన్‌ కల్యాణ్ చెబుతుండగా.. అటు బీజేపీ కూడా జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని బీజేపీ చెబుతోంది. కానీ టీడీపీతో కలిసి పోటీ చేసే అంశంపై మాత్రం.. బీజేపీ స్పష్టత నివ్వడం లేదు. ఒకవేళ బీజేపీ ఒంటరిపోరుకు దిగితే ఏం చేయాలన్నదానిపై కూడా టీడీపీ, జనసేన అధినేతలు చర్చించినట్టు తెలుస్తోంది.రెండు పార్టీలు పోటీ చేసే చాలా స్థానాలపై క్లారిటీ వచ్చినా.. మరికొన్ని స్థానాలపై స్పష్టత ఏమి రాలేదని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఇరు పార్టీల నేతలిద్దరూ మరోసారి ఫిబ్రవరి 8న భేటి కానున్నారు. ఆ సమయంలో మొత్తం సీట్లపై స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం అందుతోంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత పవన్ కళ్యాణ్.. బీజేపీతో పొత్తు విషయంపై ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉందట. అప్పుడే టీడీపీ-జనసేన పొత్తుపై ఓ స్పష్టత వస్తుందంటున్నాయి టీడీపీ వర్గాలు. అలాగే ఈ నెల 14న పాలకొల్లులో టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. పొత్తులపై స్పష్టత అనంతరం.. మేనిఫెస్టో, బహిరంగ సభపై నిర్ణయం తీసుకుంటామంటోంది టీడీపీ కేడర్.

Related Posts