హైదరాబాద్, ఫిబ్రవరి 9,
బీజీపీలో సీనియర్ నేతలు టికెట్ ఫైట్ చేస్తుండడంతో మల్కాజ్గిరి లోక్సభ స్థానం హాట్టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్లా పోటీచేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో పోటీకి సై అంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు మల్కాజ్గిరిలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇక వరంగల్ మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి కూడా మల్కాజ్గిరి సీటుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కూన శ్రీశైలం గౌడ్, సామ రంగారెడ్డి, రాంచందర్రావు కూడా పోటీకి సై అంటున్నారు. ఈటల రాజేందర్, చాడ సురేష్రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్లు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలుస్తూ తమ వినతిని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంకంటే మెరుగైన ఫలితాలు సాధించింది. సీనియర్ నేతలంతా ఓడినప్పటికీ.. ఆ పార్టీ నుండి 8 మంది అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఓటు శాతం కూడా భారీగా పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆదరణ ఎక్కువగా ఉంటుందని ధీమా కూడా పార్టీలో ఉంది. అటు కేంద్రంలో కూడా హ్యాట్రిక్ ఖాయమని బలంగా నమ్ముతున్నారు.. కమలం నేతలు. మల్కాజ్గిరిలో ఉత్తరాది ఓటర్ల ప్రభావం అధికంగా ఉండడంతో మోదీ ఫ్యాక్టర్ కూడా పనిచేసే అవకాశం ఉంది. దీంతో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం జాతీయ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు..కాషాయం నేతలు.2009లో ఏర్పాటైన మల్కాజ్గిరి స్థానం.. 30 లక్షలకు పైగా ఓటర్లతో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా రికార్డు దక్కించుకుంది. దేశంలోని అన్నిప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తుండడంతో ఈ నియోజకవర్గంలో పట్టు సాధించడం అంతసులువైన పనికాదు. అయినా ఇక్కడ నుంచి బరిలోకి దిగేందుకు అన్ని పార్టీల నుండి తీవ్రమైన పోటీ ఉంది. మల్కాజ్గిరి నుండి గెలుపొందినవారికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందన్న సెంటిమెంటు కూడా .. నేతల మధ్య పోటీకి కారణమవుతోంది. టికెట్ కోసం బీజేపీ ముఖ్య నేతలు పోటీ పడుతుండటంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి సవాల్గా మారింది. మరి బీజేపీ అధిష్ఠానం ఎవరివైపు మొగ్గుచూపుతుందన్నది ఆసక్తిగా మారింది.