హైదరాబాద్, ఫిబ్రవరి 9
తెలంగాణలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీఆర్ఎస్ పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. ఈమేరకు కేసీఆర్ ఇప్పటికే కొన్ని స్థానాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు టికెట్ ఇచ్చిన కారణంగా ఓడిపోయామన్న భావనలో ఉన్న కేసీఆర్.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సిట్టింగులందరినీ పక్కకు పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకు టికెట్ ఇవ్వొద్దని విశ్లేషకులు పార్టీ నేతలు సూచించినా కేసీఆర్ ఎవరి మాట వినలేదు. దీంతో చివరకు పార్టీకి ఓటమి తప్పలేదు. ఈ సారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. చివరి నిమిషంలో 12 స్థానాల్లో కొత్తవారిని నిలిపారు. అయితే ఆ ఎన్నికల్లో సిట్టింగుల్లో సగానికిపైగా ఓడిపోయారు. ఇక కొత్తగా ప్రకటించిన 12 మందిలో 10 మంది విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సిట్టింగులకు టికెట్ ఇవ్వడం ఎంత పెద్ద తప్పో గులాబీ బాస్కు తెలిసి వచ్చింది. కానీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభలో రిపీట్ కాకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో సిట్టింగులందరినీ పక్కన పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంచి ఇమేజ్ ఉన్న సిట్టింగులకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 9 ఎంపీ సీట్లు గెలిచింది. అందులో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలగా గెలిచారు. ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. ఇక పెద్దపల్లి ఎంపీ మూడు రోజుల క్రితం కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు 8 మంది ఎంపీలే ఉన్నారు. వెంకటేశ్నేత రాజీనామా ఆమోదిస్తే ఆ బలం ఏడుకు తగ్గుతుంది. ఈసారి అన్ని స్థానాల్లో ఫ్రెషర్స్ను పోటీ చేయిస్తే బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత కాస్తయినా తగ్గుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.