YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనలోకి డీకే ఫ్యామిలీ ఆ కుటుంబంలోనే అన్ని పార్టీలు

జనసేనలోకి డీకే ఫ్యామిలీ ఆ కుటుంబంలోనే అన్ని పార్టీలు

తిరుపతి, ఫిబ్రవరి 16,
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఇప్పుడు అదే ఫ్యామిలీలో మూడు ముక్కలాట నడుస్తోంది. కొడుకు వైసీపీతో, కూతురు టీడీపీతో, ఇక మనవరాలికి జనసేనతో దోస్తీ ఏర్పడింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పార్టీతో అంటకాగడంతో అనుచరుల్లో అయోమయం ఏర్పడింది. రాజకీయాల్లో కీలక నేతగా రాణించిన ఆ పెద్దాయన ఫ్యామిలీలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా జిల్లాలో ఇప్పుడు చర్చగా మారింది. డీకే ఆదికేశవులు. పారిశ్రామిక వేత్తగా, చిత్తూరు ఎంపీగా, టీటీడీ చైర్మన్‎గా పనిచేసిన రాజకీయ అనుభవం ఆయనది. అంతేకాదు ఏఐసీసీ కోశాధికారిగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఆయనదో ప్రత్యేకం. ఆర్థికంగానే కాదు సామాజికవర్గంలోనూ ఆయనకు అగ్రస్థానమే. ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు అత్యంత సన్నిహితుడే కాదు వ్యాపార భాగస్వామిగా పేరుంది. బలిజ సామాజిక వర్గంలో ఆయన ఒక కీల నేత. ఆదికేశవులే కాదు ఆయన భార్య డీకే సత్యప్రభ కూడా చిత్తూరు ఎమ్మెల్యేగా జిల్లా రాజకీయాల్లో కీలకంగా రాణించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందింది. డీకే ఆదికేశవులు, ఆయన భార్య సత్య ప్రభ ఇద్దరూ మరణించాక ఆ ఫ్యామిలీ వారసత్వం ఇప్పుడు పొలిటికల్‎గా రాణించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు కుటుంబంలో పొలిటికల్ డ్రామాకు తెర తీసింది. ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో కనిపిస్తున్న పరిస్తితి ఏర్పడింది.డీకే ఆదికేశవులు కొడుకు డీఏ శ్రీనివాస్ రాజకీయంగా క్రియాశీలకం అవుతున్నట్లు గత జనవరి 1న చిత్తూరులో అందరికీ విందు ఇచ్చి హడావుడి చేశారు. గత కొద్ది కాలంగా వైసీపీతో టచ్‎లో ఉన్నారు డీఏ శ్రీనివాస్. ఈ సమయంలోనే ఆదికేశవులు కూతురు తేజస్విని టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి రా కదలిరా సభ వేదికపై దర్శనమిచ్చారు. ఇక మధ్యలో ఆదికేశవులు మనవరాలు.. తేజస్విని కూతురు చైతన్య ఇప్పటికే జనసేనలో చేరారు. చిత్తూరు జనసేన అభ్యర్థి తానేనని చెప్పుకొంటున్న చైతన్య ఆ నియోజకవర్గంలో హడావిడి చేస్తున్నారు. ఇలా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన డీకే కుటుంబం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పార్టీ కండువాలతో కనిపించడం గందరగోళానికి అవకాశం ఇచ్చింది. అసలు డీకే ఫ్యామిలీలో ఎవరు ఏ పార్టీలో కొనసాగుతారు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, అసలు పోటీ చేస్తారా లేదా అనే అయోమయం అనుచరుల్లో నెలకొంది. ఈ నెల 6న గంగాధర నెల్లూరులో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభలో అదికేశవులు కూతురు తేజస్విని పాల్గొన్నారు. చంద్రబాబుతో కాసేపు కూర్చొని మాట్లాడటంతో క్యాడర్‎లో పెద్ద చర్చకే దారి తీసింది. చంద్రబాబుతో కలిసి వేదికపై తేజస్విని చేసిన హడావుడి చూస్తే ఆమెకే చిత్తూరు టీడీపీ టికెట్ అని పార్టీ కేడర్ చర్చించుకుంటోంది. తేజస్విని చిత్తూరు టికెట్‎ను ఆశించే.. చంద్రబాబును కలిశారని టాక్ వినిపిస్తోంది.ఇక కొడుకు టీఎస్ శ్రీనివాస్ అన్ని పార్టీలతోనూ టచ్‎లో ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొన్నేళ్లుగా వైసీపీతో డిఏ శ్రీనివాస్ క్లోజ్‎గా ఉంటున్నారు. గత కొద్ది నెలలుగా చిత్తూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న డీఏ శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని కూడా ప్రకటించారు. చిత్తూరుకు వచ్చినప్పుడు టీడీపీ నేతలతో టచ్‎లో ఉన్న డీఎ శ్రీనివాస్ జనవరి 1న విందుకు తెలుగుదేశం నేతలకు ప్రియారిటి ఇచ్చారు. దీంతో డీఏ శ్రీనివాస్ టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉంటారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే డిఎ శ్రీనివాస్ వైసీపీ పెద్దలతోనే అత్యంత సన్నిహితంగా గత కొన్నేళ్లుగా ఉంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‎తో పాటు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుతో సన్నిహితంగా ఉంటున్నారు. గతంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‎తో వెళ్లి సీఎం జగన్‎ను కూడా కలిసిన డీఏ శ్రీనివాస్.. వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు డీఏ శ్రీనివాస్ పొలిటికల్‎గా మౌనం పాటిస్తుండగా ఆయన మేనకోడలు, డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య హడావుడి చేస్తున్నారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్‎తో కలిసి జనసేన పార్టీలో చేరిన చైతన్య.. చిత్తూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి తానేనని చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ కేడర్‎తో సమావేశమవుతున్న చైతన్య.. నాగబాబు, నాదెండ్ల మనోహర్‎ను కలిశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పార్టీ కండువాతో కనిపిస్తుండడం ఆదికేశవులు ఫ్యామిలీ అనుచరులకు అంతుపట్టని రాజకీయవ్యూహంగా మారింది. అసలు డీకే ఫ్యామిలీ చిత్తూరు పాలిటిక్స్‎లో యాక్టివ్‎గా మారబోతోందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది.

Related Posts