హైదరాబాద్, ఫిబ్రవరి 26
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023లో ఓడిపోయింది. కాదు కాదు.. ప్రజలు ఓడించారు. పదేళ్ల కుటుంబ పాలన, అహంకారపూరిత పాలన, ప్రజలను పట్టించుకోకపోవడం, ఏపీలో కంటే.. తెలంగాణ వచ్చాకే నేతల దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు పెరగడం, అంతులేని అవినీతి, వారికి పాలకుల వత్తాసు పలకడం వంటి అనేక కారణాలు బీఆర్ఎస్ ఓటమిలో కీలక పాత్ర పోషించాయి. కేవలం 38 సీట్లకే పరిమితం చేశారు. ఇక త్వరలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దృష్టిపెట్టారు. అధికారం కోల్పోయాక వారికి ప్రజలు, ప్రజా సమస్యలు గుర్తొస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు రాజు, యువరాజు, మంత్రి, అన్నట్లుగా పాలన సాగించారు. రాచరికపు పోకడలతో ప్రజలకు విసుగు తెప్పించారు. నిరుద్యోగులతో చెలగాటం ఆడారు. హామీలు మర్చిపోయారు. డబ్బులు చల్లితే ఓట్లు పడతాయన్న అహంకారంతో ఎన్నికల్లో విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేశారు.అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల వాటా తేల్చకుండా.. పాత ఒప్పందాలకే పరిమితమైన గులాబీ నేతలకు ఇప్పుడు నీటి సమస్య గుర్తొచ్చింది. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం పోరుబాట పట్టాలనుకుంటున్నారు. ఇందుకోసం కేటీఆర్, హరీశ్రావు పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ నుంచి ఒకరు. కాళేశ్వరం నుంచి మరొకరు యాత్ర చేపడతారని సమాచారం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉత్తర తెలంగాణకు లక్ష కోట్ల ఖర్చు చేసి దక్షిణ తెలంగాణను ఎలా ఎడారిగా మార్చింది అన్న విషయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఎండగడుతోంది. దీనిని సమాధానం చెప్పలేక గులాబీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతల మాటలు ఎవరూ నమ్మడం లేదు. దీంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నిలక ఓటమి, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎదురు కాకుండా ఉండడంతోపాటు ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్న క్రెడిట్ కోసం గులాబీ నేతలు పాదయాత్ర ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో లోక్సభ ఎన్నికల్లో కూడా ఓడిపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే చాలా మంది గులాబీ నేతలు అధికార కాంగ్రెస్వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు గెలవకపోతే.. పార్టీ ఖాళీ అవుతుందన్న భావన గులాబీ ముఖ్య నాయకుల్లో నెలకొంది. దీంతో పార్టీని కాపాడడం, ప్రజా సమస్యలపై పోరాడామని అనిపించుకోవడం, లోక్సభ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా బావ, బావమర్దులు ఈ పాదయాత్ర ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవల బీఆర్ఎస్ నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి సభ సక్సెస్ కావడంతో అదే ఊపును పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనమధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించడంతోపాటు నీటివాటాలో జరుగుతున్న నష్టాన్ని తెలంగాణ సమాజం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో మరో సభ పెట్టేందకు కూడా ప్లాన్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే సభ నిర్వహించి పాదయాత్ర మొదలు పెట్టాలని భావిస్తున్నారు.కృష్ణా జలాల అంశాన్నే బీఆర్ఎస్ ప్రధాన అంశంగా ఎత్తుకోబోతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని, కాంగ్రెస్ వచ్చాక అప్పగించాలని చూస్తోందని ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణకు అన్యాయం చేస్తోందని ప్రజల ముందు దోషిగా చూపాలని భావిస్తోంది. తెలంగాణ ప్రజల సమస్యలపై కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి.