YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ వలసలు ఆగేదెలా

గులాబీ వలసలు ఆగేదెలా

హైదరాబాద్,  మార్చి 5
బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల వరద కొనసాగుతోంది. పార్టీ అస్థిత్వానికే గండి పడిందా అంటూ  బీఆర్ఎస్ శ్రేణులే చర్చించుకునేలా పరిస్థితి మారిపోయింది. గండి పూడ్చడానికి బదులు వలసల ప్రవాహాన్ని పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అలా చూస్తూ ఊరుకోవడాన్ని చూస్తుంటే తండ్రీ కొడుకులిద్దరూ చేతులెత్తేశారా అని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ రెండు సందర్భాలలోనూ కూడా బీఆర్ఎస్ లోకి వలసలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఏకంగా శాసనసభా పక్షాలనే విలీనం చేసుకున్న చరిత్ర ఆ పార్టీది. కానీ 2023 ఎన్నికల తరువాత ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. అధినేత, కార్యనిర్వాహక అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ పార్టీ నేతలే కాదు, క్యాడర్ కూడా ఖాతరు చేయని పరిస్థితి కనిపిస్తోంది. అసలు కేసీఆర్ నాయకత్వంపై ధిక్కారం పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చిన నాడే మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక 2023 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత పార్టీపై కేసీఆర్, కేటీఆర్ పూర్తిగా పట్టు కోల్పోయారని అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కళకళలాడుతూ ఉన్న తెలంగాణ భవన్ ఇప్పుడు వెలవెలబోతున్నది. నిన్న మొన్నటి వరకూ చేరికలతో కిటకిటలాడిన తెలంగాణ భవన్ ఇప్పుడు వలసన కారణంగా బోసిపోయి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు పార్టీ రెండవ శ్రేణి నాయకత్వం కూడా ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీలోకి జంప్ కొట్టేయడానికి రెడీగా ఉన్నారు.ఈ విషయంలో వారేమీ దాపరికం ప్రదర్శించడం లేదు.. బాహాటంగానే పార్టీ పట్ల తమ విముఖతను చాటుతున్నారు. క్యాడర్ పరిస్థితీ అలాగే కనిపిస్తోంది. మొదట్లో వలసలను ఆపడానికి ఏదో ఒక మేరకు ప్రయత్నించిన కేసీఆర్, కేటీఆర్ లు ఇప్పడు తమ ప్రయత్నాలు,  బుజ్జగింపులు ఫలించే పరిస్థితి లేదని అర్ధం చేసుకుని మౌనంగా జరుగుతున్నది చూస్తూ ఉండిపోతున్నారు. ఓటమి తరువాత కూడా నెపం సిట్టింగుల మీదే నెట్టేసి.. వారి పట్ల ప్రజలలో ఉన్న అసంతృప్తే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి కారణమంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్, కేటీఆర్ లకు ఇప్పుడు తత్వం బోధపడి బొమ్మ కనిపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అసంతృప్తి కేవలం సిట్టింగుల మీదే కాదనీ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి, అహకర పూరిత వైఖరి పైన కూడానని వారికి అర్థమైనట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీకి టికెట్ ఇస్తామన్నా పోటీ చేయలేం బాబోయ్ అని పారిపోయే వారి సంఖ్యే ఎక్కువ కనిపిస్తున్నదని అంటున్నారు. లీడర్లు పోయినా క్యాడర్ ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు గంభీరంగా చెబుతున్నప్పటికీ, క్యాడర్ లో పార్టీ పట్ల అసంతృప్తిని గమనించే లీడర్లు పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాభవాన్ని పక్కన పెట్టి కనీసం లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకునేలా పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేద్దామంటే అందుకూ పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ నియోజకవర్గాలకూ అభ్యర్థులను ఎంపిక చేయడమే కష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ దశలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని కనుసైగతో కంట్రోల్ చేసిన, ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా వ్యూహరచనలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇంత డీలా పడిపోయారేమిటి? అని పరిశీలకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పుకోలేని విధంగా ఆధారాలతో సహా చెరిగిపారేస్తున్నారు. ఈ తరుణంలో  లోక్ సభ ఎన్నికలలో కనీసం కొన్ని స్థానాలలోనైనా విజయం సాధించి ఆబోరు కాపాడుకోవాలని కేసీఆర్ తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో విధంగా లోక్ సభ ఎన్నికలలో పుంజుకోవాలని చూస్తున్న ఆయన బీజేపీతో పొత్తుపై పార్టీ పరంగా లీకులు ఇచ్చారు. అయితే కేసీఆర్ ఈ ఎత్తుగడ కూడా ఘోరంగా విఫలమైంది. బీజేపీతో పొత్తు వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే చెప్పు తీసుకు కొట్టండి అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు. దీనికి బీఆర్ఎస్ నుంచి గట్టిగా బదులిచ్చే నేతే లేకపోయారు. దీంతో బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ మాత్రమే తహతహలాడుతోందని అందరికీ తెలిసిపోయింది.  రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా   లోక్ సభ ఎన్నికలలో కనీసం ఒక్క స్థానంలోనైనా విజయం సాధించి చూపండి అంటూ సవాల్ విసిరారు.  అయినా కూడా కేసీఆర్ నుంచి కానీ, బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావుల నుంచి స్పందన లేదు.  దీంతో పార్టీ క్యాడర్ లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మరో వైపు ఎన్నికల ముందు రేవంత్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలనూ ఒకదాని వెంట ఒకటి గా అమలు చేస్తూ తనది మాటల సర్కార్ కాదు, చేతల ప్రభుత్వమని చాటుతున్నారు. తద్వారా లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకున్నారు. అదే సమయంలో  బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకూ అగమ్య గోచరంగా మారిపోతోంది. లోక్ సభ ఎన్నికలలో పోటీకి అభ్యర్థులనే ఎంపిక చేసుకోలేని దయనీయ స్థితికి ఆ పార్టీ దిగజారిపోయింది. అలాగే ఎన్నికల అజెండా కూడా ఇప్పటికీ ఖరారు చేసుకోలేని పరిస్థితిలో ఉంది.  మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం వైఫల్యాలు ఆ పార్టీని వదలకుండా వెంటాడుతున్నాయి.  మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఎంతగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఆహ్వానించినప్పుడు నిరాకరించిన బీఆర్ఎస్.. ఇప్పుడు అదే మేడిగడ్డ సందర్శనకు ముహూర్తం ఖరారు చేసింది.  తన వైఫల్యాన్ని జనంలో మరోసారి భూతద్దంలో చూపే ప్రయత్నంగా బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు.. ఏం చెప్పి ప్రజలను ఓట్లడగాలన్న విషయంలో స్పష్టత లేని అయోమయ స్థితిలో బీఆర్ఎస్ ఉంటే.. అధికార కాంగ్రెస్ కొలువుదీరిన ఈ మూడు నెలలలో అమలు చేసిన వాగ్దానాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవడంతో పాటు, అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఇక బీజేపీకి అయితే రామమందిరం ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంది. ఏ అజెండా లేకుండా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే.  పార్టీ ఈ పరిస్థితిలో ఉన్నా కేసీఆర్ మౌనం వీడకపోవడంతో ఆయన నాయకత్వంపై పార్టీ నేతలే కాదు, క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఇందుకు ఉదాహరణ పార్టీ నుంచి వలసలలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ అధికంగా ఉండడాన్ని చూపుతున్నారు. ఇక  బీఆర్ఎస్ ను వీడి వచ్చిన నేతలకు  బీజేపీ లోక్ సభ టికెట్లు ఇవ్వడం చూస్తుంటే ప్రజల అసంతృప్తి బీఆర్ఎస్ అధినాయకత్వం మీదా, సిట్టింగుల మీదా అన్నది స్పష్టంగా అవగతమౌతోందని అంటున్నారు.

Related Posts