YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఒక యూనిట్ పెరిగితే ఏం చేయాలి

ఒక యూనిట్ పెరిగితే ఏం చేయాలి

హైదరాబాద్, మార్చి 6
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో గృహజ్యోతి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ స్కీమ్ ఒకటి. ఆరు గ్యారంటీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలె ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే పథకంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. నిరుపేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం అమలు చేసే విషయంలో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి బిల్లు వసూలు చేయవద్దని...వారికి జీరో బిల్లు ఇస్తున్నారని హరీశ్ రావు అన్నారు. అయితే ఈ ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేవలం 200 యూనిట్లవరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్లు ఇస్తున్నారని తెలిపారు. కానీ ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే, మొత్తం 201 యూనిట్లకు బిల్లు వసూలు చేస్తున్నారన్నారు. వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. ఫ్యాన్ వేసుకోవాలా? వద్దా? లైట్ వేసుకోవాలా? వద్దా? అనేది మీటర్ రీడింగ్ చూసి నిర్ణయించుకోవాల్సిన దుస్థితికి పేదలను నెట్టడం బాధాకరం అన్నారు. కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. 200 యూనిట్లు దాటితే, 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి, మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డులుంటే, ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని నిర్ణయించారన్నారు. మిగతా వారికి నష్టం కలుగుతుందన్నారు. మొత్తంగా కేవలం మూడో వంతు పేదలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తున్నారని విమర్శించారు. రెండు వంతుల పేదలను విస్మరిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు."ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి బతుకుతున్నారు. వారు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో, వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింప చేస్తుంది. ఇది కూడా సరైన పద్ధతి కాదు. ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని కోరుతున్నాను. నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే, మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చేయాలి. అలా చేయని పక్షంలో ఈ పథకం కేవలం నామమాత్రంగానే మిగిలిపోతుంది. హామీల అమలుకు ప్రభుత్వమే తూట్లు పొడిచినట్లు అవుతుందనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. నిజంగా పేదలకు సాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, వెంటనే పై మూడు విషయాల్లో తక్షణం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

Related Posts