త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై పోలీసు అధికారులకు సమగ్ర అవగాహన ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికలకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. చాలా మంది ఎస్పీలు తొలిసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్సైజ్, అటవీ తదితర శాఖల సహకారం కూడా తీసుకుంటామన్నారు. ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. ప్రతి ఎస్పీ, కమిషనర్ కూడా ఒక్క ఘటన జరగకూడదన్న టార్గెట్ తో పని చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసు అధికారులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.