హైదరాబాద్
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం ఖండించింది. ఏసీల్లో ఉండే ఉద్యోగులకు ముందుగా జీతాలు ఇస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ మంజీత్ సింగ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని... ఉద్యోగులు కూడా రైతు కుటుంబాల నుండే వచ్చారని ఆయన అన్నారు. అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీన తమకు జీతాలు వెయ్యడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు వారు కృతజ్ఞతలు తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన మూడు డీఏ లను చెల్లించలేదని... రియంబర్స్ మెంట్ బిల్లులు ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. అలాగే జీవో నెం 5ను రద్దు చేసి , నూతన వాహనాలను కొనుగోలు చేసి డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఫైర్ డ్రైవర్ల ఎమర్జెన్సీ డ్యూటీ డ్రెస్ అలవెన్స్ ను పెంచి... ట్రైనింగ్ పూర్తయిన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఓ.డి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు.