YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విపక్షాలకు ఇబ్బందులు తప్పవా బీజేపీ బలం చూపేనా

విపక్షాలకు ఇబ్బందులు తప్పవా బీజేపీ బలం చూపేనా

విజయవాడ, మార్చి 13,
తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు కుదిరే పని కాదని విశ్లేషణలు వచ్చాయి. అసలు బిజెపి టిడిపి రూట్లోకి రాదని కూడా వైసిపి అనుకూల వర్గాలు చెప్పుకొచ్చాయి. ఒకవేళ పొత్తు కుదిరినా బిజెపి ఎక్కువ సీట్లు కోరుతుందని.. పవర్ షేరింగ్ సైతం అడుగుతుందని.. తనకు కాకున్నా పవన్ అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుందని వైసిపి అనుకూల మీడియా విశ్లేషించింది. అసలు టిడిపిని కలుపుకెళ్లేందుకు బిజెపి అగ్ర నేతలు ఇష్టపడడం లేదని కూడా తేల్చి చెప్పింది. వైసీపీ అంటేనే బిజెపికి అపార గౌరవం అని.. టిడిపికి డోర్స్ క్లోజ్ అయినట్టేనని రకరకాల ప్రచారం జరిగింది. వీటన్నింటిని తెరదించుతూ బిజెపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. పది అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైసిపి మాట చెల్లుబాటు కాకుండా పోయింది. ఇప్పటివరకు నేషనల్ మీడియా సంస్థలు ఏపీలో సర్వేలు చేశాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు అయితే ఏకపక్షంగా వైసిపి గెలుపొందుతుందని తేల్చి చెప్పాయి. అయినా సరే బీజేపీ టిడిపి పొత్తుకు ఒప్పుకుందంటే సాహసం అనే చెప్పాలి. పైగా అన్ని విధాలా సహకారం అందించే జగన్ రూపంలో వైసిపి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఏకపక్షంగా పార్లమెంట్ స్థానాలను గెలిచే ఛాన్స్ ఉంది. అయినా సరే బిజెపి పెద్దలు వైసీపీని పట్టించుకోకుండా టిడిపి తో పొత్తు పెట్టుకోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సర్వే సంస్థలు తప్పుడు నివేదికలైనా ఇచ్చి ఉండాలి. లేకుంటే  బిజెపి అగ్ర నేతలు సొంతంగా సర్వే చేయించి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఒక జాతీయస్థాయిలో మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపి.. గెలవాలనుకుంటున్న పార్టీతోనే కలుస్తుంది కానీ.. ఓడిపోయే పార్టీతో చేయి కలిపే ఛాన్స్ లేదు. వాస్తవానికి ఏపీలో పరిస్థితులపై బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉంది. బిజెపి అగ్రనేతలు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కొన్ని జాతీయ మీడియాలు చేసిన సర్వేలను వారు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. కేంద్రానికి సైతం కొన్ని నిఘా సంస్థలు ఉంటాయి. వాటిపైన కేంద్రం ఆధారపడుతుంది. వాటి నివేదికల ఆధారంగానే కేంద్రం పొత్తులపై ఒక నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం ఉంది. ఏపీలో విపక్షాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఈపాటికే నిఘా సంస్థలు హెచ్చరించి ఉండేవి కదా? కానీ బిజెపి విపక్షాలతో కలవడం ఏమిటి? తనకు అన్ని విధాలా సహకరిస్తున్న జగన్ ఉండగా.. గత ఎన్నికలకు ముందు దారుణంగా దెబ్బతీసిన చంద్రబాబును నమ్మడం ఏంటి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆ మూడు పార్టీల మధ్య పొత్తు సవ్యంగా ముందుకు సాగుతోంది. సీట్ల సర్దుబాటు సైతం ఒక కొలిక్కి వస్తోంది. మొత్తానికైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏపీ విషయంలో తీసుకున్న నిర్ణయం సైతం హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీలో గెలుపోటములను పరిగణలోకి తీసుకునే బిజెపి నిర్ణయం తీసుకొని ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బీజేపీ  బలం ఎంత అంటే, పొరుగున ఉన్న తెలంగాణతో పోలిస్తే తక్కువే అన్నది మాత్రం నిర్వివాదంశం. ఏపీలో బీజేపీకి సైద్ధాంతికంగా బలమైన మద్దతుదారులు ఉన్నా, రాజకీయాల్లో సొంతంగా అభ్యర్ధులను గెలిపించుకునే స్థాయిలో మాత్రం లేదు. అందుకే కనీసం కార్పొరేటర్లుగా కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవనే విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చేది.బీజేపీ ఆవిర్భావం నుంచి నలభై ఏళ్లలో దేశంలో 2 పార్లమెంటు స్థానాల నుంచి సొంతంగా దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగినా ఏపీలో మాత్రం ఆ పార్టీ ఎందుకు ఎదగలేక పోయిందనే చర్చ పలు మార్లు చర్చకు వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నీడలో ఉండిపోవడం వల్లే ఏపీలో బీజేపీ ఎదగలేదనే విమర్శ ఉంది. 2018లో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నా తర్వాత మళ్లీ ఆ పార్టీతో జట్టు కట్టేది లేదని బీజేపీ ప్రకటించింది. అయితే అనూహ్యంగా 2024 నాటికి ఆ రెండు పార్టీలు మళ్లీ జట్టు  కట్టాయి.2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు 117 స్థానాల్లో పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిచోట డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్రంలో పోలైన ఓట్లలో బీజేపీకి కేవలం 0.85శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేనకు 7శాతం లోపు ఓట్లు వచ్చాయి.ఏపీల సొంతంగా ఎదగడానికి ఐదేళ్లలో బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేసింది. ఏపీలో కమ్మ సామాజిక వర్గం టీడీపీకి, రెడ్లు వైసీపీ వైపు ఉండటంతో మూడో బలమైన సామాజిక వర్గం కాపుల్ని ఆకర్షించేందుకు వారికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. మొదట కన్నా లక్ష్మీనారాయణ, తర్వాత సోము వీర్రాజులకు బాధ్యతలు అప్పగించారు. ఐదేళ్ల తర్వాత అనూహ్యంగా దగ్గుబాటి పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.ఏపీ బీజేపీలో సిద్దాంతపరంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల బీజేపీ వర్గంతో పాటు టీడీపీ అనుకూల వర్గం ఒకటి, వైసీపీ అనుకూల వర్గం ఇంకోటి ఉన్నాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే మళ్లీ 2019 ఫలితాలు పునరావృతం అవుతాయనే అవగాహన కూడా బీజేపీ పెద్దలకు ఉంది.అదే సమయంలో టీడీపీతో జత కలిసే విషయంలో కూడా బీజేపీ నేతల్లో బిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఎన్డీఏలో మిత్రపక్షంగా లేకున్నా మోదీ మాట జవదాటని పార్టీగా నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమితో కలిసి పోటీ చేయడం ద్వారా బీజేపీ వీలైనన్ని పార్లమెంటు స్థానాలలను దక్కించుకోవాలని భావిస్తోంది.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాతినిథ్యం ఉండాలనే లక్ష్యంతోనే టీడీపీ-జనసేన  కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. గెలుపొటములు, సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఏపీలో గెలిచే స్థానాలన్నీ తమకే దక్కుతాయనే అంచనాతో బీజేపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌  నుంచి బీజేపీ సొంతంగా గెలిచే స్థానాలతో పాటు మిగిలిన పార్టీలు గెలిచే స్థానాలు కూడా తమ చెప్పు చేతల్లోనే ఉంటాయనే అంచనా బీజేపీకి ఉంది.

Related Posts