YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ కాంగ్రెస్ కు రేవంత్ ఊపిరి పోస్తారా

ఏపీ కాంగ్రెస్ కు రేవంత్ ఊపిరి పోస్తారా

విశాఖపట్టణం, మార్చి 15,
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడింది. పదేళ్లపాటు అధికారానికి, ప్రజలకు దూరమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంచెం పుంజుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అది సీట్ల దాకా వెళ్తుందని ఎవరూ చెప్పడం లేదు. కాకపోతే గతంలో ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఎంత పెంచుకుంటందనేదాన్ని బట్టే కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు.  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీసీసీ చీఫ్ షర్మిల కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పదహారో తేదీన విశాఖలో బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్న పేరు ఉండేది.కాంగ్రెస్‌ను అమితంగా ఆదరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజన తర్వాత దూరం పెట్టారు. విభజన కన్నా ఎ్కకువగా జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఎక్కవ నష్టం చేసింది. క్యాడర్ అంతా ఆ పార్టీకి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయింది.  నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఇప్పుడు ఉనికిని కాపాడుకోవడమే కష్టంగా మారింది. రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బ కొట్టింది. మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఘోరమైన పరాభవాన్ని 2014 ఎన్నికల్లో ఆ పార్టీ చవిచూసింది. నవ్యాంధ్ర రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా సాధించకపోగా,   డిపాజిట్లు కోల్పోయింది. దీంతో పార్టీలోని ముఖ్య నేతలు అందరూ ఇతర పార్టీలకు ఒక్కరు ఒకరుగా వలస పోయారు. దీంతో కాంగ్రెస్ ఖాళీ అయింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిందా లేదా అన్నది కూడా ఎవరూ పట్టించుకోలేదు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. కానీ అక్కడ పరిస్థితిలు అంత సానుకూలంగా కనిపించకపోవడంతో కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకున్నారు. కానీ ఆమెను తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. ఆమె వల్ల పార్టీ నష్టపోతుందని.. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వాలన్నారు. ఆ ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత  కాంగ్రెస్‌లో చేరిపోయారు షర్మిల. కొద్దిరోజులకే  ఏపీ పీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో రంగంలోకి దిగారు. వరుసగా పర్యటనలు చేస్తున్నరు. దీంతో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆశ పడుతున్నారు.షర్మిల ఏపీ బాధ్యతలు తీసుకుంటే తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని రేవంత్ రెడ్డి కూడా  హామీ ఇచ్చారు. రెండు సార్లు షర్మి  రేవంత్ రెడ్డిని కలిసి.. ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చించారు.   పదేళ్లపాటు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో నైనా పుంజుకునేందుకు తన చరిష్మాను ఉపయోగించడానికి సిద్ధమయ్యారు.  ఒక్క సీట్ అయినా దక్కించుకొని ఖాతా తెరుస్తుందా అన్న సందేహాలు ున్నప్పటికీ..  2014తో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో తమ పార్టీ మంచి పురోగతి సాధించిందని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు.  అభ్యర్థులు దొరకని పరిస్థితి నుంచి ఒక్కో స్థానానికి నలుగురైదుగురు అభ్యర్థులు పోటీ పడే స్థాయికి వచ్చామని.    రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 13 వందల దరఖాస్తులు అందాయని అంటున్నారు.   రాష్ట్ర విభజన తర్వాత ప్రజల నిరాదరణకు గురై ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్‌కు తిరిగి పూర్వ వైభవం దక్కుతుందా... రేవంత్, షర్మిల చరిష్మా ఎంతవరకు పనిచేస్తుంది...అన్నది చాలా మందికి అంతుబట్టనివిషయం .  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 16న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో జరిగే మహాసభలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ వేదిక. సాక్షిగా అధికార ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వాల్తేరు రైల్వే జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలను ఎన్నికల ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ షర్మిల విమర్శనాస్రాలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.  రేవంత్ రెడ్డికి ఏపీలోనూ మంచి ఆదరణ ఉంది. ఆయన దూకుడు రాజకీయానికి అభిమానులు ఉన్నారు. అయితే ఓట్లు తెచ్చి పెడతాయా అన్నది తేలాల్సి ఉంది.  

Related Posts