హైదరాబాద్, మార్చి 16
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ షెడ్యూల్ ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. అయితే దేశంలో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, లోక్సభ ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా 543 స్థానాలకు 7 విడతల్లో జరుగనున్నాయి. 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలిసిందే.ఇప్పుడు తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 4వ విడతలో మే 13వ తేదీన తెలంగాణలోని అన్ని లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే ఏపీ, తెలంగాణలో ఒకే సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.
నామినేషన్లు ప్రారంభం – ఏప్రిల్ 18
నామినేషన్ల చివరి తేదీ – ఏప్రిల్ 25
పోలింగ్ తేదీ – మే 13
ఎన్నికల ఫలితాలు – జూన్ 4
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై పోల్ షెడ్యూల్ ఇదే..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఉప ఎన్నికలను కూడా ఆయా రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు వివిధ విడతల్లో నిర్వహించనున్నారు.ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల సిబ్బంది ఉండనున్నట్లు రాజీవ్ తెలిపారు. జూన్ 16వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే దేశంలో కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని అన్నారు. ఈ సారి 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
2019 తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఇలా..
2019 గత లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో బీఆర్ఎస్ 9 , బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3, ఎంఐఎం 1 గెలుచుకున్నాయి.