హైదరాబాద్, మార్చి 18
ప్రముఖ సింగర్ మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వ్యాన్ ఢీకొనగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరై అర్ధరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిపై వస్తుండగా.. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.