YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అస్త్రాలు, శస్త్రాలు సిద్ధం

అస్త్రాలు, శస్త్రాలు సిద్ధం

విజయవాడ, మార్చి 19
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు మెజారిటీ లోక్ సభ స్థానాలను దక్కించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి అవసరమైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేశాయి. ప్రచారం పర్వం పై దృష్టిపెట్టాయి. ఈ విషయంలో జగన్ దూకుడు మీద ఉన్నారు. ఏకకాలంలో అభ్యర్థులను ప్రకటించడంతో పాటు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలను పూర్తి చేశారు. ఇప్పుడు ఆసక్తికరమైన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పర్యటన ఉండేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ జనసేన, బిజెపితో జత కట్టిన సంగతి తెలిసిందే. ఆ మూడు పార్టీలు సైతం ఎన్నికల ప్రచార సభను నిర్వహించాయి. చిలకలూరిపేట లో జరిగిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. వైసీపీని టార్గెట్ చేశారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తామని చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీ సర్కార్ అవినీతి మయంగా మారిందని మోదీ ఆరోపణలు చేశారు. దీంతో వైసిపి పై ప్రధాని మోదీ అభిప్రాయం మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే జగన్ సైతం దూకుడు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 57 రోజులపాటు ఎన్నికల ప్రచార సభలతో హోరెత్తించాలని భావిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి.. ప్రజల్లోకి బలంగా వెళ్లాలని చూస్తున్నారు. ఈరోజు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మేనిఫెస్టో తో పాటు ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. కీలక అంశాలపై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.మేనిఫెస్టో విషయంలో జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు నవరత్నాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా నవరత్నాలకు తలదన్నేలా మేనిఫెస్టో ప్రకటించాలని చూస్తున్నారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లు వైసిపి నేతలు చెబుతున్నారు. ఈనెల 20న మ్యానిఫెస్టో విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో.. పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ లెక్కన దాదాపు 57 రోజుల గడువు ఉంది. అందుకే మ్యానిఫెస్టో విడుదల తేదీని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 11 లేదా 12న విడుదల చేయాలని భావిస్తున్నారు. తొలి దశ పోలింగ్ 19వ తేదీన జరగనుండడంతో అక్కడికి వారం రోజులు ముందు మేనిఫెస్టో విడుదలకు నిర్ణయం తీసుకోవడం విశేషం.

Related Posts