YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉద్యమపార్టీకి సలపని ఊపిరి

ఉద్యమపార్టీకి సలపని ఊపిరి

హైదరాబాద్, మార్చి 22,
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఆయన ఇంకా కోలుకోలేకపోతున్నారు. అంతేకాదు వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలోనూ కిందా మీదా పడుతూ వస్తుంది. బీఆర్ఎస్ నేతల బ్లాక్‌మెయిల్స్ మొదలయ్యాయి. మొన్నటి వరకూ గొంతెత్తని నేతలు కూడా నేడు తమ వైపు చూడకపోతే జంప్ చేస్తామంటూ సిగ్నల్స్ పంపుతున్నారు. ఉద్యమ పార్టీ అధినేతకు ఇది ఊపిరి సలపనివ్వడం లేదు. నిన్నటి వరకూ తాను ఆదేశించిందే ఆచరించిన నేతలు నేడు రొమ్ము విరుచుకుని ఎదురుతిరగడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలన్న పట్టుదల ఆయనలో కనిపిస్తుంది. అప్పుడే నేతల గేట్లు దాటే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ కు అంతుచిక్కని స్ట్రాటజీలతో ముందుకు వెళుతున్నారు. బలమైన నేతలను తన పార్టీలోకి చేర్చుకుంటున్నారు. తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పథ్నాలుగు స్థానాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత నిరాశలోనే ఇంకా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్యాడర్ కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది మరొక వైపు కేసీఆర్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ ను ఎదగనివ్వకుండా ఉండేందుకు బీజేపీకి తెలంగాణలో చోటు కల్పించారన్న వాదన ఉంది. బీజేపీ బలం పెంచుకోవడానికి కేసీఆర్ కారణమన్న అభిప్రాయమూ లేకపోలేదు. బీజేపీ ఎంత ఎదిగితే కాంగ్రెస్ బలహీనపడి ఓట్లు చీలి మూడోసారి తాను అధికారంలోకి వస్తానని ఆయన భావించి పరోక్షంగా బీజేపీ ఎదుగుదలకు ఆయన సహకరించాడంటారు. కాంగ్రెస్ ను వదిలేసి, బీజేపీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని చిత్రీకరించడం, బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని కేసులు నమోదు చేయడం, బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వంటివి బీజేపీీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.అయితే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానంలోకి వెళ్లిపోయిందన్న వార్తలు గులాబీ పార్టీల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. లోక్‌సభ ఎన్నిక్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉందన్న సీన్ ఇప్పటికే క్రియేట్ అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ కావడం కూడా బీజేపీకి కలసి రావడంతో పాటు బీఆర్ఎస్ కు కొంత రాజకీయంగా ఇబ్బందిగా మారిందంటున్నారు. కవిత అరెస్ట్‌తో సానుభూతి రాకపోగా, లిక్కర్ స్కాంలో అరెస్ట్ కావడంతో ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ నాడు బీజేపీ ఎదగాలని కోరుకుంటే.. ఇప్పడు అదే పార్టీ తనకు తలనొప్పిగా మారింది. మొత్తం మీద కేసీఆర్ గతంలో తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటి ఆయనకు, ఆయన పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయని చెప్పకతప్పదు.
ఆపినా ఆగేదెవరు...
ఇప్పుడు అనుకుని ఏం లాభం..? అవసరం లేకపోయినా.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని అనుకున్నప్పుడు ఉండాలి. ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా శాసనసభలో కనపడకుండా చేయాలన్న కుట్రపూరితమైన ఆలోచన చేయకపోతే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు. నాయకులది తప్పు కాదు. వాళ్లు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరతారు. వారికి ఐదేళ్లు పవర్ ఒక్కటే కావాలి. 2014లోనూ, 2018లోనూ నాడు బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతినే నేడు కాంగ్రెస్ అనుసరిస్తుంది. అందులో తప్పుపట్టడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రజలు అంతిమ తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే తప్ప నాడు కండువాలు కప్పి నేడు వాళ్లు కప్పుతుంటే.. కయ్ కయ్ మని అరుస్తూ.. సుద్దులు చెప్పడాన్ని మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోరు.  తెలంగాణలో తనకు తిరుగులేదని భావించిన కేసీఆర్ గత తొమ్మిదేళ్లలో పార్టీలను కకావికలం చేయాలని భావించారు. ఇక్కడ బలమున్న పార్టీలను సరే.. బలహీన పార్టీలను కూడా వదిలిపెట్టలేదు. టీడీపీ, వైసీపీలకు ఇక్కడ చోటు లేదని తెలిసినా ఆ పార్టీలో గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకున్నారు. శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లో కలిపేసి విజయదరహాసం చేశారు. ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను ప్రగతి భవన్ కు రప్పించుకని మరీ వారిని తన పార్టీలోకి రప్పించుకున్నారు. నాయానో, భయానో తెలియదు కానీ.. ఒక దశలో వేరే పార్టీలకు ఓట్లు వేయడం అనవసరమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఓటమి తర్వాత తానేంటో ఆయనకు అర్థమయింది. పార్టీ వీడి వెళ్లిన వారిని ఇక చేర్చుకోబోనని ఉన్నవారిని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు గులాబీ బాస్. కానీ బీఆర్ఎస్ లో దొరకని స్వేచ్ఛ కాంగ్రెస్ లో దొరుకుతుందనుకుంటే వాళ్లను ఆపేదెవరు? ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఈ పనిని చేయడం మంచిది కాదు. కానీ దాని అవసరం అలాంటిది. అరకొర మెజారిటీ రావడం, ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే సవాళ్లు విసురుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అది గేట్లు తెరిచేసింది. దీనిని తప్పు పట్టలేని పరిస్థితి. ప్రజాస్వామ్యం అని ఇప్పుడు గగ్గోలు పెట్టి ప్రయోజనం లేదు. ఆ ఆలోచన గత పదేళ్లలో గులాబీ బాస్ కు ఎందుకు రాలేదు? పార్టీ మారిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయాల్సిందేనంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు సుద్దులు చెబుతుండటం చూస్తుంటే... గురిగింజ సామెత గుర్తుకు రాకమానదు. నాడు కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించి ఆ పార్టీలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే.. ఇప్పుడు ఏం మాట్లాడినా కొంత అర్థముండేది. కానీ నాడు నువ్వు చేసిందే.. వాళ్లు నేడు చేస్తున్నారు.. ఇప్పుడు చేయాల్సింది.. మౌనంగా ఉండటం తప్ప ఇంకా ఏది చేసినా జనాలకు కూడా ఏవగింపుగా ఉంటుంది తప్ప మరొకటి కాదన్నది ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలి. అందుకే అన్నారు.. నీవు నేర్పిన విద్యయే.. అన్న సామెత గులాబీ బాస్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది

Related Posts