YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అందరి చూపు.... ఆ నియోజకవర్గాల వైపే...

అందరి చూపు....  ఆ నియోజకవర్గాల వైపే...

విజయవాడ, మార్చి 23
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించి  సార్వత్రిక సమరానికి  కాలు దువ్వగా...అంతే దీటుగా అధికారపార్టీ వైసీపీ ఒకేసారి మొత్తం అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి సిద్ధమంది. ఒకటి, రెండు మినహా ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. వారి బలబలాలు ఏంటో తెలిసిపోయాయి. అయినా కానీ ఎన్నికలు వచ్చాయంటే మాత్రం...తమ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారా అన్న దానికన్నా...ఫలానా సీటు ఎవరు గెలిచారు. ఎవరిపై ఎవరు పై చేయి సాధించారన్న ఆసక్తి కొన్ని నియోజకవర్గాలపై  ఉంటుంది.గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పోరు రాయలసీమ ఎన్నికలను తలపించాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు....అరెస్ట్‌లు, ఆందోళనలతో ఉత్తరాంధ్ర ఉడికెత్తిపోయింది. ఇప్పుడు మరోసారి  అదే అభ్యర్థులు ప్రత్యర్థులుగా తలపడుతుండటంతో మరింత ఆసక్తి రేకెత్తుతోంది. ముఖ్యంగా   శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల పోరు అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది టెక్కలి నియోజకవర్గమే. ఎందుకంటే ఇక్కడి నుంచి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తుండగా... ఆయనపై మరోసారి దువ్వాడ శ్రీనివాస్ పోటీపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వీరిరువురి మధ్య జరిగిన సవాళ్లు, ప్రతిసవాళ్లు ప్రజల కళ్లముందే కదలాడుతోంది. ఇప్పుడు మరోసారి వీరువురి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీపడుతుండటంతో  తీవ్ర ఆసక్తి కలుగుతోంది. మరో నియోజకవర్గంపైనా అందరి దృష్టిపడింది. ఆమదాలవలసలో మరోసారి బావబావమరిది పోటీపడుతున్నారు. సభాపతి తమ్మినేని సీతారాంపై ఆయన మేనల్లుడు, బావమరిది అయిన కూన రవికుమార్‌ పోటీ చేస్తున్నారు. తమ్మినేని వారసుడిగానే  రాజకీయ అరంగ్రేటం చేసిన కూన రవికుమార్ ఏకంగా ఆయనపైనే పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో బావ చేతిలో ఓటమి చవిచూశారు. వీరిరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఉండటంతో  వీరిద్దరి మధ్య పోటీ సైతం ఆసక్తి కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలో మరోసారి బొత్స కుటుంబానికి సీట్లు దక్కగా...వారిపై పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నది ఆసక్తి కలుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణపై దీటైన అభ్యర్థి కోసం తెలుగుదేశం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆయనకు సరైన ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావేనని భావించి చంద్రబాబు...ఇప్పటికే రెండుసార్లు ఆయనకు సూచించారు. చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందిగా  కోరినా...గంటా శ్రీనివాసరావు  విముఖత చూపినా....ఆయన్నే బరిలో దింపనున్నారని తెలిసింది. ఇదే జరిగితే ఉత్తరాంధ్రలో సమఉజ్జీల సమరం చూడొచ్చు.విశాఖ జిల్లా గాజువాకలోనూ చివరి నిమిషంలో సీటు దక్కించుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీని ఆసక్తిగా మలిచారు. అటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు పోటీలో ఉండగా...ఇటు మంత్రి అమర్నాథ్‌ రంగంలోకి దిగడంతో పోరు ఆసక్తిగా మారింది. అలాగే వరుసగా గెలుపులతో ఊపుమీద ఉన్న విశాఖ తూర్పులో రామకృష్ణబాబుపై  వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దింపింది. భీమిలిలోనూ మాజీమంత్రి ముత్తంశెట్టి సత్యనారాయణ వైసీపీ నుంచి మరోసారి బరిలో నిలవగా...తెలుగుదేశం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇదే సీటు కోసం గంటా శ్రీనివాసరావు తీవ్రంగా పట్టుబడుతున్నారు. ఒకవేళ ఈ సీటు గంటాకు దక్కితే..ఒకప్పటి స్నేహితుల మధ్య పోరు చూడొచ్చు. పాయకరావుపేటలో తెలుగుదేశం ఫైర్‌బ్రాండ్, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత బరిలో నిలవగా....వైసీపీ కంబాల జోగులకు టిక్కెట్ కేటాయించింది. అలాగే నర్సీపట్నంలోనూ  పాత ప్రత్యర్థులు మరోసారి పోటీపడుతున్నారు. మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై  శంకర గణేశ్‌ మళ్లీ తలపడనున్నారు .రాష్ట్రంలో ఎవరు గద్దెనెక్కాలి..ఎవరు దిగిపోవాలని డిసైడ్‌ చేసే కీ ఓట్లు, సీట్లు ఉన్న గోదావరి జిల్లాల్లోనూ ఈసారి గాలి ఎటు తిరుగుంతో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అత్యంత కీలక నేతలంతా ఈ రెండు జిల్లాల్లోనూ ఉండటం విశేషం. జగ్గంపేటలో తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన తోట నరసింహం మరోసారి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగగా....జగన్‌ వెన్నంటే ఉండి అన్నీ తానై పనిచేసిన జ్యోతులనెహ్రూ తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఈసారి పోటీపడుతున్నారు. తునిలో మంత్రి దాడిశెట్టి రాజాపై అనూహ్యంగా టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను పోటీలో నిలబెట్టారు. ఇక్కడా పోటీ ఆసక్తికరంగా మారింది.రాష్టవ్యాప్తంగా అందరి చూపు ఒకే ఒక్క నియోజకవర్గంపై ఉంది అంటే అది పిఠాపురమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈసారి పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై కాకినాడ ఎంపీ వంగా గీతను వైసీపీ నిలబెట్టింది. రాజమండ్రి బరిలో ఎంపీ మార్గాని భరత్‌ దిగుతుండగా... సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు ఆయన్ను ఢీకొట్టనున్నారు. రాజమండ్రి రూరల్‌లో సైతం పోటీ ఆసక్తికరంగా ఉంది. టీడీపీ ఫైర్‌బ్రాండ్..రాజకీయ కురువృద్ధుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై ఈసారి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణను వైసీపీ ప్రయోగించింది. అలాగే దెందులూరులో చివరి నిమిషంలో రేసులోకి వచ్చిన చింతమనేని ప్రభాకర్‌, అబ్బయ్య చౌదరిని మరోసారి ఢీకొట్టబోతున్నారు. ఇక పాలకొల్లు, భీమవరం, నరసాపురంలోనూ పోటాపోటీగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలుగా పేరుగాంచిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈసారి పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో రెండే రెండు నియోజకవర్గాలపై అందిరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూసే రెండు నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఉన్నాయి అవే ఒకటి గుడివాడ, రెండోది గన్నవరం. తెలుగుదేశంలో గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీకి మరోసారి గన్నవరం టిక్కెట్ కేటాయించగా...గతంలో ఆయనపై ఓటమి చెందిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. ఇప్పుడు వీరివురిలో పైచేయి ఎవరిదో తేలాల్సి ఉంది. అలాగే గుడివాడలో కొడాలినానిపై ఎన్నారై వెనిగండ్ల రామును తెలుగుదేశం బరిలో దింపింది. ఇదే జిల్లాలో విజయవాడలోని మూడు సీట్లతోపాటు పెనమలూరు, మైలవరంలోనూ పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ‌అక్కడ టీడీపీ నుంచి వసంతకృష్ణ ప్రసాద్ పోటీలో ఉన్నారు.రాజధాని జిల్లాగా పేరుగాంచిన గుంటూరు జిల్లాలో అందిరిచూపు మంగళగిరిపైనే ఉంది. ఇక్కడ నుంచి టీడీపీ యువనేత నారాలోకేశ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా...వైసీపీ పలువురి అభ్యర్థులను మారుస్తూ చివరికి మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యను బరిలో దింపింది.  రాజధాని గ్రామాలు తీవ్ర ప్రభావం చూపే తాడికొండలో మరోసారి తెనాలి శ్రావణ్‌కుమార్ పోటీపడుతుండగా..వైసీపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను రంగంలోకి దింపింది. గుంటూరు పశ్చిమలోనూ పోటీ రంజుగా మారనుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మంత్రి విడుదల రజనీ పోటీలో ఉండగా...టీడీపీ సైతం అనూహ్యంగా మహిళా నేత పిడుగురాళ్ల మాధవిని పోటీలో నిలిపింది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. చిలకలూరిపేట సీటు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దక్కించుకోగా....వైసీపీ పలువురు అభ్యర్థులను మార్చి కావటి మనోహర్‌నాయుడుని బరిలో నిలిపింది. పల్నాడులోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా పేరుగాంచిన మాచర్లలో మరోసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికే వైసీపీ సీటు ఇవ్వగా...తెలుగుదేశం ఆయనకు దీటుగా జూలకంటి బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్ ఇచ్చింది.ఒంగోలులో మారోసారి మాజీ ప్రత్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్ధన్ పోటీపడుతున్నారు. అద్దంకి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి తెలుగుదేశం టిక్కెట్ ఇవ్వగా...వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి బరిలో దిగుతున్నారు. నెల్లూరు రూరల్‌లో వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయి జగన్‌ పై మాటలదాడి చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ప్రయోగించింది. సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డిపై పోటీగా సోమిరెడ్డిని బరిలోకి దింపింది టీడీపీ. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల రాజకీయ వారసులు రంగంలోకి దిగారు. తిరుపతి నుంచి భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి బరిలో దిగగా...టీడీపీ ఈసీటు పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించే అవకాశం ఉంది. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు జితేంద్రభరత్ పోటీలో ఉండగా...టీడీపీ నుంచి పులవర్తినాని మరోసారి పోటీ చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబుపై కృష్ణ రాఘవ జితేంద్ర భరత్‌ను వైసీపీలో పోటీలో నిలిపింది. ఇక నగరి సీటు మంత్రి రోజా మళ్లీ దక్కించుకోగా...మాజీమంత్రి గాలిముద్దుకృష్ణమనాయుడి కుమారుడు భానుప్రకాశ్‌కు టీడీపీ అవకాశం ఇచ్చింది. పుంగనూరులో పెద్దిరామచంద్రారెడ్డిని చల్లా రామచంద్రారెడ్డి ఏమాత్రం ఢీకొట్టాడో వేచి చూడాల్సిందే. వైఎస్సాఆర్ జిల్లాలో పులివెందుల నుంచి మరోసారి వైఎస్‌ జగన్ పోటీ చేస్తుండగా...ఆయనపై పాత ప్రత్యర్థి బీటెక్ రవి బరిలో నిలుస్తున్నారు.కర్నూలులో తొలిసారి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా అటు టీడీపీ నుంచి పాత అభ్యర్థి టీజీ భరత్ పోటీ చేస్తున్నారు. ఆళ్లగడ్డలో మరోసారి చిరకాల రాజకీయ ప్రత్యర్థులు భూమా, గంగుల కుటుంబాలో యుద్ధానికి సిద్ధమంటున్నాయి. టీడీపీ నుంచి భూమా అఖిలప్రియా, వైసీపీ నుంచి గంగుల బిజేంద్రరెడ్డి పోటీ పడుతున్నారు. అలాగే డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి బరిలో దిగుతున్నారు.అనంతపురం జిల్లాలో రాప్తాడు నుంచి పరిటాల సునీత టీడీపీ తరపున పోటీచేస్తుండగా...తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బరిలో దిగుతున్నారు. ఉరవకొండలో పాత ప్రత్యర్థులు పయ్యావుల కేశవ్, విశ్వేశ్వర్‌రెడ్డి పోటీపడుతున్నారు. తాడిపత్రిలో కేతిరెడ్డిపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డిని పోటీలో నిలబెట్టారు. హిందూపురంలో టీడీపీ నుంచి హ్యాట్రిక్ విజయం కోసం బాలయ్య బరిలో దిగగా...వైసీపీ దీపికకు టిక్కెట్ ఇచ్చింది. తెలుగుదేశం, జనసేన కీలక నేతలపై జగన్ ఆడవారిని పోటీలో నిలిపారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌పై వంగా గీత, మంగళగిరిలో లోకేశ్‌పై లావణ్యను, హిందూపురంలో బాలకృష్ణపై దీపకను నిలబెట్టారు. ఒకవేళ వీరిలో ఎవరి ఓడినా..ఆడవారి చేత ఓడించామన్న ప్రచారం చేసేందుకే ఇలాంటి ఎత్తుగడ వేశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

Related Posts