YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మరో భారీ డ్రగ్ నెట్ వర్క్ గుట్టు రట్టు

మరో భారీ డ్రగ్ నెట్ వర్క్ గుట్టు రట్టు

హైదరాబాద్
పంజాగుట్ట పోలీసులు మరో భారీ డ్రగ్ నెట్వర్క్ ను  ఛేదించారు. గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న కీలక నిందితుడితోపాటు కొన్నేళ్లుగా దేశంలో అక్రమంగా ఉంటూ హైదరాబాద్లో మత్తుపదార్థాలు విక్రయిస్తున్న పాలస్తీనా శరణార్థిని నాలుగు రోజుల క్రితం అరెస్టు చేశారు. వీరిద్దరినీ విచారించగా.. గోవా, బెంగళూరు, ముంబయిలలో ఉంటూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేసే 14 మంది(వీరిలో ఏడుగురు నైజీరియన్లు) స్మగ్లర్లు, హైదరాబాద్కు చెందిన 31 మంది వినియోగదారుల పేర్లు వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరు నిందితుల నుంచి 4.75 గ్రాముల 10 ఎక్స్టెసీ మాత్రలు, 5.18 గ్రాముల ఎండీఎంఏ, 109 గ్రాముల గంజాయి, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అల్ కాఫ్రి అలియాస్ సయీద్(38) సిరియాలో ఉండేందుకు పాలస్తీనా శరణార్థిగా ప్రత్యేక గుర్తింపు కార్డు తీసుకున్నాడు. అనంతరం 2009లో సౌదీ నుంచి విద్యార్థి వీసా తీసుకుని తన సోదరుడితో కలిసి హైదరాబాద్ వచ్చాడు. టోలిచౌకిలో ఉంటూ సైఫాబాద్ పీజీ కళాశాలలో డిగ్రీ, సెయింట్ మేరి కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశాడు. 2017లోనే వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా ఉంటున్నాడు. పోలీసులకు పట్టుబడకుండా భారతీయుడినని నమ్మించేందుకు 2018లో ఆధార్కార్డు, పాన్కార్డు సంపాదించి బ్యాంకు ఖాతా తెరిచాడు. కొన్నాళ్లుగా బంజారాహిల్స్లో ఉంటూ డ్రగ్స్కు అలవాటుపడి విక్రయాలు మొదలుపెట్టాడు. గోవా, బెంగళూరు, ముంబయిలలో ఉండే నైజీరియన్లు ఇతర స్మగ్లర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నాడు. ఇతనిపై అమీర్పేట ఆబ్కారీ ఠాణాలో 3, బేగంపేట ఠాణాలో ఒక కేసు ఉన్నాయి.
2023 సెప్టెంబరులో సయీద్కు గోవాలోని బరోజ్ ప్రాంతంలో ఉండే డ్రగ్స్ విక్రేత రోమీ భరత్ కల్యాణితో పరిచయం ఏర్పడింది. ముంబయికి చెందిన రోమీ(40) ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి డ్రగ్స్కు అలవాటుపడ్డాడు. భారత్కు తిరిగొచ్చాక డ్రగ్స్ విక్రయాలు మొదలు పెట్టాడు. గోవాలో ఉండే నైజీరియాకు చెందిన క్రిస్ ద్వారా సరకు తెప్పిస్తుంటాడు. గతేడాది నుంచి అతని వద్ద సయీద్ కొనుగోలు చేస్తున్నాడు. గత వారం సయీద్.. 10 ఎకసీ మాత్రలు, 5 గ్రాముల ఎండీఎంఏ, 100 గ్రాముల గంజాయి కావాలని ఆర్డర్ పెట్టాడు. గోవాలో క్రిస్ దగ్గర వాటిని కొనుగోలు చేసిన రోమీ ఈ నెల 23న ప్రైవేటు బస్సులో హైదరాబాద్ చేరుకున్నాడు. పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర సయీదు విక్రయిస్తుండగా పోలీసులు వలపన్ని ఇద్దర్నీ పట్టుకున్నారు.

Related Posts