తెలంగాణలో నేడు, రేపు వడగాలులు.. ఉదయం 11 తర్వాత బయటకెళ్లొద్దని వార్నింగ్:
తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. వారం రోజుల నుంచి 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం సైతం కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలకు సమీపించాయి. ఉదయం 9 గంటలకే 41 డిగ్రీలు దాటేస్తోంది. గంట గంటకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు బయటకెళ్లొదని నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బకు ఓ నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు.రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గురువారం వడగాలలకు నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. గురువారం తెలంగాణవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. ఇందులో 14 ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ దాటేయడం ఎండల తీవ్రతకు అద్దంపడుతోంది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాదే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక, మరో రెండు రోజుల పాటు తీవ్రత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.అంతేకాదు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీవ్రత అధికంగా ఉంటుందని.. ఈ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని వాతావరణ నిపుణులు సూచించారు. గురువారం నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీలు, కనగల్లో 43.4 డిగ్రీలు, బుగ్గబావిగూడ 43.2, నాంపల్లి, నిడమనూరు, కట్టంగూరులో 43 డిగ్రీలు, టిక్యా తండాలో 42.9 డిగ్రీలు, డిండి (గుండ్లపల్లి)లో 42.8 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయినట్టు అధికారులు తెలిపారు.
ఆ తర్వాత గద్వాల జిల్లా వడ్డేపల్లి, ధరూర్, ద్యాగదొడ్డి, తిమ్మనదొడ్డి, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, వంకులం, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం , పినపాక మండలం బయ్యారంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.