కరీంనగర్ ఏప్రిల్ 6,
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. మొదట కరీంనగర్ రూరల్ జిల్లా ముగ్ధుంపూర్లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై ఆరా తీశారు. రైతులు ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతన్నలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు గులాబీ దళపతి ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని తెలిపారు. గత సంవత్సరం నీరు సంవృద్ధిగా ఉండేదని.. వరి కోత కోసేందుకు ఇబ్బందయ్యేదని పేర్కొన్నారు.ఇప్పుడు పొలమంతా ఎండిపోయింది.. ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులందరు బతుకుదురని చెప్పారు. మంచినీళ్లకు కూడా గోసవుతుందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పోయిన సంవత్సరం మండుటెండల్లో కూడా చెక్డ్యామ్లు మత్తడి పోశాయని.. ఈ సంవత్సరం చుక్కా లేకుండా అడుగంటిపోయాయని మరో రైతు తెలిపారు. స్పందించిన కేసీఆర్ రైతులకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. రైతులకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తెలిపారు..అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో పర్యటించారు. గులాబీ దళపతికి రైతులు ఎండిపోయిన వరిపైరుని చూపిస్తూ గోడును మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అన్నదాతలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎన్నికల తర్వాత మేడిగడ్డకు 10వేల మంది రైతులతో కలిసి ముట్టడికి వెళ్దామని పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని.. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం శాభాష్పల్లి వద్ద మధ్య మానేరు జలాశయాన్ని పరిశీలించారు.