YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉగాది తర్వాత మళ్లీ టీఆర్ఎస్సే

ఉగాది తర్వాత మళ్లీ టీఆర్ఎస్సే

హైదరాబాద్, ఏప్రిల్ 8
తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్‌. తెలంగాణ రాష్ట్ర సమితిని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. 2001, ఏప్రిల్‌ 21న పార్టీ పురుడు పోసుకుంది. దాదాపు 22 ఏళ్లుగా పార్టీ అదే పేరుతో కొనసాగింది. 14 ఏళ్లు ఉద్యమించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించింది. తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదేళ్లు పాలించింది. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో దేశంలో అగ్రగామిగా నిలిపారు. సాగునీరు అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్‌ సమస్య పరిష్కరించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు, దళితులకు మూడెకరాల భూమి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ తదితర నిర్ణయాలతో అన్ని వర్గాల ఆదాయం పెంచారు. మద్యం అమ్మకాల ద్వారా రికార్డు ఆదాయం రాబట్టారు. ఇలా తెలంగాణలో పదేళ్లు తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ టీఆర్‌ఎస్‌.అయితే కేసీఆర్‌ పదవీ కాంక్ష.. 22 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని ప్రశ్నార్థకం చేసింది. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుంది అన్న చందంగా ప్రధాని కావాలన్న కేసీఆర్‌ కోరిక పార్టీ పేరు మార్పుకు కారణమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఎవరితో చర్చించకుండా ఎవరి నిర్ణయాలు తీసుకోకుండా భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ పార్టీగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 నవంబర్‌లో వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీగా బరిలో దిగారు కేసీఆర్‌. కానీ, గులాబీ నేత తీసుకున్న నిర్ణయం తప్పు అన్నట్లుగా తెలంగాణ సమాజం ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది. తెలంగాణలో తమకు తిరుగులేదనుకున్న కేసీఆర్‌ను గద్దెదించింది. ప్రతిపక్షానికి పరిమితం చేసింది. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో గుర్తుచేసింది. తాను రాజు అన్నట్లుగా పాలించిన కేసీఆర్‌కు ఒక్క ఓటమితో కనువిప్పు కలిగింది. ఓటమి తర్వాత కూడా కొన్ని రోజులు తమ ఓటమిని అంగీకరించకుండా కాంగ్రెస్‌ తప్పుడు హామీలపైనే గులాబీ నేతలు పొద్దుపోయారు. కానీ, ఇప్పుడు గులాబీ పార్టీని సీనియర్‌ నేతలు వీడుతుండడంతో కేసీఆర్‌ పునరాలోచనలో పడ్డారు. పార్టీ పేరు మార్పు ద్వారా తప్పు చేశామని భావిస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా తెలంగాణ భవన్‌కు ఉన్న వాస్తు దోషం కారణంగా కూడా నాయకులు పార్టీ వీడుతున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు పండితులు కూడా చూసించారు. దీంతో భవనం గేటు మారుస్తున్నారు. వాయవ్య దిశలో ఉన్న గేటును ఈశాన్యంవైపు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పేరు కూడా మార్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు పార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు.

Related Posts