హైదరాబాద్, ఏప్రిల్ 10,
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్సు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం పట్ల మహిళల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమై కుటుంబాల ఆదాయానికి ఊతమిచ్చింది. గత ఏడాది డిసెంబర్ 9న ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ 7 వరకు కేవలం నాలుగు నెలల్లోనే మహిళలు రూ.1,177 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాన్ని పొందారు. అంటే బస్ టికెట్లు, పాసుల కొనుగోలుకు మహిళలు ఖర్చు చేసిన మొత్తం రూ.1,177 కోట్లు ఆదా అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాద్రి, కొండగట్టు తదితర ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించడానికి మహిళలు పెద్ద సంఖ్యలో ఉచిత బస్సు సర్వీసులను ఉపయోగించుకోవడంతో ఆలయాలకు ఆదాయం పెరిగింది. ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన గత డిసెంబర్ నుంచి ఆలయాల హుండీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి.మొదట్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో రోజుకు సగటున 29.67 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ లో రోజుకు సగటున ఆరు లక్షల మంది మహిళలు ఉచిత సిటీ బస్సు సర్వీసులను వినియోగించుకుంటున్నారు.ఏప్రిల్ 7న మహిళలకు రూ.1,177 కోట్ల విలువైన జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది. గతంలో నగరంలో మహిళలు బస్ పాస్ లు, టికెట్ ఛార్జీల రూపంలో ప్రయాణ ఖర్చుల కోసం నెలకు రూ.1,500 ఖర్చు చేసేవారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల మహిళలకు ఈ మేరకు ఆదా అయింది. తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి హామీలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.