YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీగా ఎంసెట్ దరఖాస్తులు

భారీగా ఎంసెట్ దరఖాస్తులు

హైదరాబాద్, ఏప్రిల్ 10
తెలంగాణలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఎప్‌సెట్‌ దరఖాస్తు గడువు ఏప్రిల్ 6తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక రూ.250 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 9తో గడువు ముగిసింది. అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు రూ.500 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 19 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో మే 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులు నిర్ణీత అపరాధ రుసుముతోపాటు ఇంజినీరింగ్ (లేదా) అగ్రికల్చర్ & ఫార్మా పరీక్షల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఇక రెండు విభాగాలకు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే దరఖాస్తుల సవరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 12 వరకు వివరాల్లో తప్పులుంటే సవరించుకోవచ్చు.
పరీక్ష కేంద్రాల పెంపుపై అధికారుల దృష్టి..
టీఎస్ ఎప్‌సెట్‌-2024కు దరఖాస్తులు పోటెత్తుతుండటంతో.. పరీక్ష కేంద్రాల పెంపుపై అధికారులు దృష్టిసారించారు. ఏప్రిల్ 9న సాయంత్రం వరకు ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి 2,50,919, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీకి 97,995, రెండింటికి హాజరయ్యే వారు 333 మంది చొప్పున మొత్తంగా 3,49,247 దరఖాస్తులు అందాయి. మే 1 వరకు దరఖాస్తుకు అవకాశం ఉండటంతో.. దరఖాస్తులు మరిన్ని పెరిగే అవకాశముంది. దీంతో కొత్త సెంటర్ల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లోని ల్యాబ్‌ గదుల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అన్నీ సౌకర్యాలూ ఉంటే ఆయా కళాశాలల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
జోన్లు బ్లాక్..
➥ రెండు, మూడు రోజుల వరకు హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో పరీక్ష కేంద్రాలు కేటాయించే పరిస్థితి ఉంది. కానీ దరఖాస్తుల సంఖ్య పెరగడంతో.. ఇప్పుడు హైదరాబాద్‌-1, హైదరాబాద్‌-3 జోన్లను బ్లాక్‌ చేయాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇందులో జోన్‌-1లో 45,923, జోన్‌-3లో 39,835 సీటింగ్‌ కెపాసిటీ ఉండగా.. ఈ రెండు జోన్ల పరిమితి మించడంతో ఆయా జోన్లను అధికారులు బ్లాక్‌ చేశారు. హైదరాబాద్‌ జోన్‌-4 సామర్థ్యం 27 వేలు కాగా, ఇప్పటికే 26 వేల దరఖాస్తులు వచ్చాయి. జోన్‌-2 సామర్థ్యం 43,592 కాగా, ఇప్పటి వరకు 41 వేలకు పైగా వచ్చాయి. కొత్త దరఖాస్తుదారులకు ఈ జోన్‌లోనే పరీక్ష కేంద్రాలను కేటాయిస్తున్నారు. ఇంకా 4 వేలకు పైగా దరఖాస్తులొస్తే ఇవి కూడా బ్లాక్‌ చేయాల్సిందే.
➥ హైదరాబాద్‌ తర్వాత ఇంజినీరింగ్‌కు అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 11,900, ఉమ్మడి కరీంనగర్‌లో 10,770 సీటింగ్‌ సామర్థ్యం ఉండగా, మొత్తం నిండిపోవడంతో వీటినీ బ్లాక్‌ చేశారు.
➥ చిన్న పట్టణమైన నర్సంపేటలో ఇంజినీరింగ్‌కు 2,255, ఫార్మసీకి 1,353 మంది అభ్యర్థులకు పరీక్ష కేంద్రం కేటాయించే వీలుండగా, సమీప ప్రాంతాల నుంచి భారీగా దరకఖాస్తులు రావడంతో అక్కడ పరీక్ష కేంద్రం కేటాయింలేని పరిస్థితి తలెత్తింది. సత్తుపల్లిలో ఇంజినీరింగ్‌ 2,085, ఫార్మసీకి 1,251 సామర్థ్యం ఉండగా, పరిమితి మించడంతో బ్లాక్‌ చేశారు.
➥ ఇక ఫార్మసీ విద్యార్థుల కోసం కేటాయించిన సెంటర్లల్లో 22 వేల వరకు సీట్లు ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌ జోన్‌-1లో 2,445, జోన్‌-2లో 16,660 చొప్పున ఖాళీలు ఉన్నాయి. గతేడాది ఫార్మసీకి లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు మరింత గడువు ఉన్న నేపథ్యంలో.. పరిస్థితిని చూసి దరఖాస్తులు తక్కువగా వస్తే ఫార్మసీ సెంటర్లల్లోని ఖాళీలను ఇంజినీరింగ్‌ విభాగం వాళ్లకు బదిలీ చేసే యోచనలో అధికారులు ఉన్నారు.
వివరాలు…
➥ టీఎస్ ఎప్‌సెట్-2024
ఇంజినీరింగ్ కోర్సులు: బీఈ/ బీటెక్‌, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (బయో-టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (ఎంపీసీ), ఫార్మ్-డి (ఎంపీసీ).
అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సులు: బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ(ఫారెస్ట్రీ), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (బైపీసీ), ఫార్మ్-డి (బైపీసీ),
అర్హత: ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు సంబంధించి డిప్లొమా చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 31.12.2024 నాటికి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు 16 సంవత్సరాలలోపు ఉండాలి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు: ఇంజినీరింగ్ (లేదా) అగ్రికల్చర్ & ఫార్మా పరీక్షల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఇక రెండు విభాగాలకు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్ (4 జోన్లు), నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Related Posts