మంథని
తాను రాజకీయ నాయకున్నని,టీచర్, ఫిలాసఫర్ కాదని తప్పకుండా రాజకీయమే చేస్తానని, ఎవరైనా భయభ్రాంతులకు గురిచేస్తే చట్టపరిధిలో, చట్టంప్రకారం అసలు సిసలైన రాజకీయం చేసి చూపిస్తానని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు మంత్రి శ్రీధర్ బాబుకు పూలమాలలు వేసి,శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ... అతి క్లిష్టంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం తనకు ఈ మంత్రి పదవని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తనను ఐదు సార్లు గెలిపించిన మంథని నియోజకవర్గ ప్రజలకు, సమాజానికి మరింత మేలు చేయాలని ఆశీర్వాదం ఇచ్చిన ఆత్మీయులకు ధన్యవాదములు తెలిపారు. టేలాండ్ ప్రాంతానికి సాగునీటి కోసం శాశ్వత ప్రణాళికలు చేపడతామన్నారు. తాను అధికారాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నానని తనకు వచ్చిన అవకాశంతో అందరికీ మంచి చేసే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మంథని పట్టణాన్ని సరస్వతి కేంద్రంగా తీర్చిదిద్ది ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పట్టనాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రజలు సహకరించాలని కోరారు.