హైదరాబాద్ను 2022 నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీపురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు కేటీఆర్ అక్కడున్న వారిచే ప్రతిజ్ఞ చేయించారు. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్యునైటెడ్ నేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏరిక్ సోలీహిమ్ హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి 20ఎలక్ట్రిక్ వాహనాల(కార్లు)ను కేటీఆర్ అందజేశారు. చెత్త తరలింపునకు స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపుకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను కేటీఆర్తో పాటు ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు తిలకించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎరిక్ సోలీహిమ్ ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన తడిపొడి చెత్తను వేరు చేయడాన్ని వారు చూడటం జరిగిందని తెలిపారు. ఇప్పటికే సాలీడ్ వెస్ట్ మేనేజ్మెంట్ను అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు జీహెచ్ఎంసీని అభినందిస్తున్నానని చెప్పారు. నగరంలో ఎల్ఈడీ బల్బులను హైదరాబాద్ అంతటా వాడటం వలన విద్యుత్ వినియోగం తగ్గించామని పేర్కొన్నారు. సాలీడ్ వెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పి ఉత్పత్తి చేస్తామన్నారు. సేకరించిన చెత్తను వేరు చేసి తడి చెత్తను ఎరువుగాపొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. దశలవారీగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడుతామని మంత్రి చెప్పారు.యునైటెడ్ నేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏరిక్ సోలీహిమ్ తెలుగులో స్వచ్ఛ నమస్కారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని సందర్శించాను.. చాలా అందంగా ఉందని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిటీ కోసం పని చేయడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జంతువులకు ప్రాణాంతకంగా మారుతుందన్న ఏరిక్ సోలీహిమ్.. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలని సూచించారు.