కరీంనగర్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రచంఢ రూపం దాల్చడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. అయితే సాయంత్రం అయ్యేసరికి వాతావరణంలో మార్పులు వచ్చేస్తున్నాయి. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై జోరుగా వాన కురుస్తోంది. దీంతో ఉష్ణతాపం నుంచి ప్రజలు కొంత సేదతీరుతున్నారు. కానీ పగటిపూట పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉంటుందని చెప్పొచ్చు. వేసవి ఎఫెక్ట్ కొనసాగుతుందనే చెప్పాలి. ఇటీవలిగా ఎండలు మరీ ఉగ్రరూపం దాల్చాయి. ఉష్ణోగ్రతల తీవ్రతకు ఉడికి పోతున్న పరిస్థితి. ఉదయం 7గంటల నుంచే ఎండ మండిపోతుండడంతో ప్రజల పాట్లు అప్పట్నుంచే మొదలైపోతున్నాయి. రోజుకు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. టెంపరేచర్ల ఎఫెక్ట్కు రహదారులన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రత పెరగడంతో చిన్నాపెద్దా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల లోపే 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయానికి అదికాస్తా అత్యధికంగా 42 డిగ్రీలకు చేరుతోంది. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.
కొద్దిరోజులుగా అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్న దుస్థితి. ఏసీలు, కూలర్లు ఉన్నవారి పరిస్థితి బాగానే ఉన్నా.. ఇలాంటి సౌకర్యాలు లేని వారు సతమతమైపోతున్నారు. ఉష్ణతాపానికి ఇప్పటికే అనేకమంది ప్రభావితమయ్యారు. అనారోగ్యం పాలయ్యారు. దీంతో బయటకు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఎండల ధాటికి అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావడం లేదు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో అత్యవసర పనులుంటే తప్ప బయటకు వెళ్లకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు సాంయంత్రం సమయాల్లో కురుస్తున్న వానలు ఎండ చీకాకును తొలగిస్తున్నాయనే చెప్పొచ్చు. అయితే ఈ వానలు కూడా ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు స్పష్టంచేస్తున్నారు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు అనారోగ్యాలకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు. జలుబు, గొంతునొప్పి, జ్వరంతో పాటూ విష జ్వరాలూ ప్రబలే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.