YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ లో ఫేక్ వీడియో...

హైదరాబాద్ లో ఫేక్ వీడియో...

హైదరాబాద్, మే 3
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియో సృష్టించింది తెలంగాణలోనేనని తేలింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్  ఐపీ అడ్రస్ ఆధారంగా వీడియో సృష్టించిన ప్రదేశం తెలంగాణలోనే ఉందని గుర్తించింది. ఈ క్రమంలో నకిలీ వీడియో సృష్టికర్తలను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీస్ IFSO (ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్) విభాగం అధికారులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.మరోవైపు ఆ నకిలీ వీడియో సృష్టికర్తలను తెలంగాణ పోలీసులు అప్పటికే అరెస్టు చేయడంతో ట్రాన్సిట్ వారంట్‌పై వారిని ఢిల్లీకి తరలించి ప్రశ్నించాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరెస్టయిన నలుగురూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడం, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తుండడం కేసులో కీలక మలుపుగా మారింది. కేసు నమోదు చేసిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసినవారికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసింది. ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుని గాంధీభవన్‌లో సమన్లు స్వయంగా అందజేయగా.. సమన్లు అందుకున్నవారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. వారిని మే 1న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆదేశించినప్పటికీ.. హాజరుకాకుండా ఒక జవాబు మాత్రం పంపించారు. రేవంత్ రెడ్డి సహా సమన్లు అందుకున్నవారు పంపిన జవాబుపై ఢిల్లీ పోలీసులు సంతృప్తి చెందలేదని తెలిసింది. అందుకే తాజాగా మరోసారి సమన్లు జారీ చేసేందుకు ఢిల్లీ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఐపీ అడ్రస్ ఆధారంగా తొలుత ఆ వీడియోను పోస్టు చేసినవారిని గుర్తించి అరెస్టు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ  అగ్రనేత, కేంద్ర హోంమంత్రి ఓ బహిరంగ సభలో తెలంగాణలో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు. దానికి కొనసాగింపుగా.. ఆ రిజర్వేషన్ల హక్కుదారులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అని, వారికి దక్కాల్సిన ఫలాలను ముస్లింలకు అందిస్తున్నారని ఆరోపించారు. ఈ వీడియో క్లిప్‌ను ఎడిట్ చేసి.. ముస్లిం అని మాట్లాడిన వాక్యంలో ఆ పదాన్ని తొలగించి, తర్వాతి వాక్యంలో ఉపయోగించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనే పదాలను తీసుకొచ్చి అతికించారు. దాంతో తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని అమిత్ షా అన్నట్టుగా వీడియో తయారైంది.ఇలా ఎడిట్ చేసిన వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా పేజీలు, ఖాతాల్లో పోస్ట్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని, స్వయానా ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా యే ఈ మాటలు చెప్పారని కామెంట్ చేస్తూ ఆ వీడియోలను వైరల్ చేశారు. రిజర్వేషన్ల వ్యవహారం దేశంలో అత్యంత సున్నితమైనది, సమస్యాత్మకమైనది. రిజర్వేషన్ల కోసం గతంలోనూ పెద్ద ఉద్యమాలు జరిగాయి. నేటికీ గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పటేళ్లు, మరాఠాలు, కాపులు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి అంశంపై లేని మాటలు అన్నట్టుగా ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేయడం ద్వారా బీజేపీ విజయావకాశాలు దెబ్బతీయాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నంగా ఇది అర్థమవుతోంది.ఇదే ఆ పార్టీ ఆగ్రహానికి కారణమైంది. స్వయానా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే అనేక వేదికలపై రిజర్వేషన్లపై తమ వైఖరి ఏంటో చెబుతూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ప్రజల్లో తప్పుడు సమాచారం, సందేశం చొచ్చుకుపోయి తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కమలదళ అగ్రనేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐపీసీ సెక్షన్లు 153, 153(ఏ), 465, 469, 171(డీ)తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టులోని సెక్షన్ 66(ఏ) ప్రకారం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.అమిత్ షా ఫేక్ వీడియోను పోస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తెలంగాణవారే కాదు, దేశంలోని మరికొన్ని రాష్ట్రాల విభాగాలు సైతం ఈ వీడియోను పోస్టు చేశాయి. కొందరు నేతలు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లోనూ పోస్టు చేశారు. మరికొందరు కాంగ్రేసేతర విపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఈ వీడియోను పోస్టు చేశారు. అలాంటివారిని గుర్తించి ఢిల్లీ పోలీసులు సమన్లు పంపించారు. వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఉపయోగించిన ఫోన్లు, డిజిటల్ పరికరాలతో సహా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఏ ఒక్క రాజకీయ పార్టీ సభ్యుడు కూడా ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్  యూనిట్ ముందు హాజరు కాలేదని అధికారులు తెలిపారు.తెలంగాణతో పాటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొంతమంది నేతలకు, ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ నేతకు కూడా నోటీసులు పంపించినట్టు వారు వెల్లడించారు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 22 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసి గురు, శుక్ర, శనివారాల్లో పోలీసుల ఎదుట హాజరుకావాలని ఢిల్లీ పోలీసులు అదేశించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు సభ్యులు బుధవారం ఐఎఫ్‌ఎస్‌ఓ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉండగా, వారు హాజరుకాలేదు. విచారణకు సంబంధించిన అధికారి ఒకరు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నలుగురు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సభ్యులు శివకుమార్ అంబాలా, అస్మా తస్లీమ్, సతీష్ మన్నె, నవీన్ పట్టోమ్‌లకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 91, సెక్షన్ 160 కింద సమన్లు జారీ చేసినట్టు తెలిపారు.
ఒక వ్యక్తికి CrPC సెక్షన్ 160/91 కింద నోటీసు ఇస్తే, ఆ వ్యక్తి విచారణ అధికారి ముందు నేరుగా హాజరు కావచ్చు లేదంటే తన తరఫున చట్టపరమైన ప్రతినిధిని కూడా పంపవచ్చు. ఈ క్రమంలో బుధవారం రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది విచారణ అధికారి ఎదుట హాజరై, షా ప్రసంగానికి సంబంధించిన వీడియోను ట్యాంపరింగ్ చేయడంతో పాటు పోస్ట్ చేయడంలో రేవంత్ రెడ్డికి సంబంధం లేదని వెల్లడించారు. తాను కేవలం తన వ్యక్తిగత ఖాతాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఖాతాను మాత్రమే నిర్వహిస్తున్నానని, ఏ ఇతర ఖాతాలతో తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి జవాబులో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సమాధానంపై ఢిల్లీ పోలీసులు సంతృప్తి చెందలేదు.రాష్ట్ర పార్టీ అధికారిక ఖాతా నుంచి పోస్టు చేసినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడే బాధ్యులవుతారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి హోదాలో కాకుండా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి హోదాలోనే ఈ పోస్టులకు బాధ్యుణ్ణి చేస్తూ సమన్లు జారీ చేసినట్టు వివరిస్తున్నారు. రేవంత్ సమాధానంపై సంతృప్తికరంగా లేనందున మరోమారు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు ఫేస్ వీడియోను సృష్టించినవారిలో నలుగురిని తెలంగాణ పోలీసులు ముందే అరెస్టు చేయడంతో వారిని తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నారు. ఆ మేరకు న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు.

Related Posts