YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గెలుపుపై అందరిదీ ధీమానే

 గెలుపుపై అందరిదీ ధీమానే

ఒంగోలు, మే 8
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్దులను ప్రచారాలను పీక్‌ స్టేజ్‌కు తీసుకెళుతున్నారు. నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో భారీ ర్యాలీలు, సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో తెలియచేసే పార్టీల మేనిఫెస్టోలను ప్రజలకు వివరించడంతోపాటు ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు సంధిస్తూ కేడర్‌ను ఉత్సాహపరుస్తున్నారు. దీంతో పట్టణాలతోపాటు పల్లెలు ఎన్నికల సంగ్రామానికి సిద్దమవుతున్నాయి. ఎన్నికల ప్రచారం మరో నాలుగురోజుల్లో ముగియనుండటంతో అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో నియోజకవర్గాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది.ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ అభ్యర్దులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో భారీ ర్యాలీలతో రోడ్‌షోలు చేస్తూనే, మరోవైపు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలో వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మధ్య మధ్యంలో భారీ ర్యాలీలతో రోడ్‌షోలు చేస్తూ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.ఇటు ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గం, అటు ఒంగోలు అసెంబ్లీ స్థానాలు వైసీపీకి కంచుకోటగా ఉండటంతో ఈసారి కూడా తమ గెలుపు సునాయాసం చేసుకునేందుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసులురెడ్డిలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ఇతర నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు భారీ ర్యాలీలతోపాటు గ్రామ గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తన తల్లి, జడ్‌పి ఛైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి ఎన్నికల ప్రచారాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ స్వగ్రామం బొద్దికూరపాడులో బూచేపల్లి కుటుంబం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలికారు. దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబాన్ని ముందు నుంచి ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారని, ఈసారి కూడా సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని దర్శి వైసీపీ అభ్యర్ధి బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు టీడీపీ అభ్యర్ధులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. బాపట్లజిల్లా పర్చూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీ ర్యాలీలు నిర్వహిస్తూ, గ్రామాలను చుట్టేస్తున్నారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న స్వర్ణ గ్రామంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరడంతో ఇక్కడ భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. గత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏలూరి సాంబశివరావు ఈసారి కూడా ఎన్నికల్లో తనను గెలిపించి హ్యాట్రిక్‌ సాధించేందుకు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.మరోవైపు అద్దంకి టీడీపీ అభ్యర్ధి గొట్టిపాటి రవికుమార్‌ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మార్టూరు నుంచి ఒకసారి, అద్దంకి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ ఐదోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అద్దంకి నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన గొట్టిపాటి నాలుగోసారి కూడా అద్దంకి నుంచి ప్రజలు తనను గెలిపిస్తారన్న ధీమాతో ఉన్నారు. అద్దంకి పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈసారి కూడా అద్దంకిలో తన గెలుపు ఖాయమంటున్నారు ఎమ్మెల్యే గొట్టిపాటి.

Related Posts