గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లకు అదనంగా మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను అన్వేషించాల్సిందిగా అధికారులను కోరినట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నేడు జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం నగరవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లలో ఈ సంవత్సరంతానికి 40వేల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తామని, మిగిలినవి వచ్చే సంవత్సరం జూన్ మాసానికి పూర్తి అవుతాయని పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం హైదరాబాద్ నగరంలో నాలుగు లక్షల మంది ఇల్లులేనివారు ఉన్నారని తేలిందని, వచ్చే సంవత్సరానికిగాను డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి స్థలాల సేకరణను చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ నగరంలో నిజమైన అభివృద్ది జరుగుతోందని, ఇందుకు నిదర్శనం వేలాది కోట్ల రూపాయలతో ఎస్.ఆర్.డి.పి, డబుల్ బెడ్రూం ఇళ్లు, మెట్రో రైలు ఇతర మౌలిక సదుపాయాల కల్పనను చేపట్టే పనులను వివరించారు. దేశంలోనే ఇతర ప్రముఖ నగరాల్లో అభివృద్ది, విస్తరణ దాదాపుగా స్తంభించిపోయిందని, కేవలం హైదరాబాద్ నగరమే పలు జాతీయ, అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఉందని అన్నారు. విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్ నగరం వైపు ప్రతిఒక్కరూ చూస్తున్నారని, ఈ విశ్వనగర సాధనకు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ప్రతిఒక్క అధికారి, సిబ్బంది సైనికుల్లా పనిచేయాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఫలాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ది పైనే మొత్తం తెలంగాణ అభివృద్ది ఆధారపడి ఉందని అన్నారు. 14ఏళ్ల సుధీర్ఘ అహింసాహిత పోరాటం ద్వారా సాధించిన తెలంగాణను అభివృద్ది, సంక్షేమ రంగాల్లో అగ్రస్థానంలో ఉంచేందుకు ప్రతిఒక్కరం కృషిచేయాలని కోరారు. హైదరాబాద్ చరిత్రలో గతంలోలేనంతగా కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు నడుస్తున్నాయని, అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందుతుందని అన్నారు.
*"స్వచ్ఛ సంవత్సరం"గా ప్రకటన*
హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే స్వచ్ఛ నగరంగా రూపొందించడానికి జూన్ 5వ తేదీ నుండి సంవత్సరం పాటు స్వచ్ఛ సంవత్సరంగా పాటించాలని నిర్ణయించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి తెలియజేశారు. ఇప్పటికే సాలిడ్ వేస్ట్మేనేజ్మెంట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, అదేవిధంగా గత సంవత్సరంలో జీహెచ్ఎంసీలో చేపట్టిన పలు ఉత్తమ విధానాలకు 13జాతీయ స్థాయి అవార్డులు లభించాయని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీలో అన్ని స్థాయిలో కలిసి 30వేల మందికిపైగా అధికారులు, సిబ్బంది ఉన్నారని, ప్రతిఒక్కరూ కనీసం పది ఇళ్ల చొప్పున దత్తత తీసుకొని పారిశుధ్యం, తడి, పొడి చెత్తను వేర్వేరు చేయించాలని కమిషనర్ సూచించారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రతిఒక్కరం ఇతరులపై ఆధారపడి జీవించాల్సి ఉంటుందని, ఈ సూత్రాన్ని ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా అన్వయించుకొని ఇతరులతో కలిసి పనిచేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన అహింసాయుత ఉద్యమం ప్రపంచ చరిత్రలో మరెక్కడా జరగలేదని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తమ పని విధానంలో మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగర ప్రతిష్ట జీహెచ్ఎంసీకి చెందిన ప్రతిఒక్క అధికారి, సిబ్బంది పనితీరుపై ఆధారపడి ఉందని అన్నారు. అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు భారతిహోలికేరి, అద్వైతకుమార్సింగ్, ముషారఫ్ అలీ, కెనడి, రవికిరణ్, రమేష్, వి.కృష్ణ, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, సిఇలు జియాఉద్దీన్, శ్రీధర్, సిసిపి దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొనగా సీపీఆర్ఓ వెంకటరమణ వందన సమర్పణ చేశారు.