మల్కాజ్ గిరి
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఎన్నికల్లో తాము భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. నేడు ప్రచారానికి చివరి రోజు కావడంతో నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా, వికారాబాద్ జెడ్పి చైర్పర్సన్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఇప్పుడు మల్కాజ్గిరి నుండి ఎంపీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నానని తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా ఆదర్శవంతమైన ఎంపీ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తాము ఎక్కడ ప్రచారం నిర్వహించిన ప్రజలలో మంచి స్పందన కలుగుతుందన్నారు. బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడతాయని ప్రజలే తమకు గుర్తు చేస్తున్నారని వెల్లడించారు. ఇలానే సంక్షేమం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రమేష్ విజ్ఞప్తి చేశారు.