YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంతు పట్టని ఓటరు నాడి

అంతు పట్టని ఓటరు నాడి

విజయవాడ,  మే 15,
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా.. ఎవరికి అధికారం అన్నది మాత్రం అంతుచిక్కకుండా ఉంది. పోలింగ్ శాతం మాత్రం భారీగా నమోదయింది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు జనం క్యూ కట్టారు. గతంలో ఏఎన్నికల్లో చూడని విధంగా అర్థరాత్రి దాటేంత వరకూ పోలింగ్ జరిగింది. ఇది ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది.చివరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఏజెంట్లు కూడా ఆ బూత్ లో తమ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇందుకు కారణం ఓటర్లందరూ గుంభనంగా ఉండటమే. ఏ నేత వచ్చినా నవ్వుతో పలుకరిస్తుండటం కూడా అంచనాలకు అందడం లేదు.పోలింగ్ కు వచ్చిన వారిలో అధిక శాతం మంది తమకే ఓటు వేసి ఉంటారని భావించి ఇటు అధికార వైసీపీ కానీ, అటు ప్రతిపక్ష కూటమి నేతలు కూడా ధీమాగానే కనిపిస్తున్నారు. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పోలింగ్ జరిగే సమయంలో జనం మూడ్ ను బట్టి ఒక అంచనాకు ఈసారి రాలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం. ప్రభుత్వంపై ఆగ్రహం ఉంటే ఆ స్థాయిలో అర్ధరాత్రి వరకూ వేచి ఉండి ఓటు వేసేవారా? అని అధికార పార్టీ ప్రశ్నిస్తుంది. ఇది పాజిటివ్ ఓటుగానే తాము భావిస్తామని వైసీపీ ఫంఖా భజాయించి చెబుతుంది. కానీ ఈ ప్రభుత్వం పోతేనే తమ బతులకులు మారతాయని భావించి ఓటర్లు కసితో ఉన్నారని, అందుకే ఎంత సమయమైనా వేచి ఉండి మరీ ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పెట్టుకుని క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచున్నారన్నది కూటమి నేతల వాదన. ప్రాంతాల వారీగా చూసుకుంటే ఈసారి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలో అత్యధిక స్థానాలను సాధించి తీరుతామని చెబుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోనూ తాము ఆశించిన దానికంటే బెటర్ ఫలితాలు సాధిస్తామని చెబుతున్నారు. అందుకే తమలో అంత కాన్ఫిడెన్స్ ఉందని అంటున్నారు అయితే విశ్లేషకులకు కూడా ప్రజల నాడి అందడం లేదు. మహిళలు, వృద్ధులు, యువత అధిక సంఖ్యలో రావడంతో కొంత అటుఇటుగానే ఫలితాలు ఉంటాయని అంచనాలు వినపడుతున్నాయి. ఎవరు గెలిచినా మ్యాజిక్ ఫిగర్ కు బోర్డర్ లోనే ఉంటారన్నది ఎక్కువ మంది విశ్లేషకుల అంచనా. గత ఎన్నికల్లో మాదిరి వన్ సైడ్ ఎన్నికలు మాత్రం ఈసారి జరగలేదన్నది అందరూ అంగీకరించే వాస్తవం. మహిళలు ఎవరివైపు మొగ్గు చూపితే వారిదే అధికారం. అందుకే మహిళ ఓటర్లు సంక్షేమ పథకాలకు ప్రభావితులయి ఓటు వేశారా? లేదా మార్పుకోసం కొంగు బిగించారా? అన్నది మాత్రం అర్థం కాకుండా ఉంటుందన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ తో పాటు సోషల్ ఇంజినీరింగ్ కూడా బాగా పనిచేసే ఛాన్స్ ఉందన్నది ఎక్కువ మంది విశ్లేషకులు అందిస్తున్న అభిప్రాయంగా ఉంది. మరి జూన్ 4వ తేదీన గాని ఎవరు విజేత అన్నది తెలియదు.

Related Posts