సంగారెడ్డి
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు ఆదేశించారు.
పటాన్ చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీ కళాశాల స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచిన జహీరాబాద్ ఎంపీ పరిధిలోని ఈవీఎంలకు చెందిన సెక్యూరిటీ లాక్ బుక్ రిజిస్టర్స్ లను, మూడు అంచెల సెక్యూరిటీ ఏర్పాటు ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఐడి కార్డు లేకుండా ఎవరిని అనుమతించవద్దని CRPF సెక్యూరిటీ అధికారుల కు ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూంలతో పాటు వాటి పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సీ.సీ కెమెరాలను అమర్చి, మానిటర్ల ద్వారా పర్యవేక్షణ జరిపిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న ప్రతి కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ సీల్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అధికారులకు సూచనలు చేశారు. జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది రాకపోకలకు, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ టేబుల్స్, ఇతర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఈ పరిశీలనా కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ , EEPR సురేష్, తహసీల్దార్ రంగారావు , ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.